సాధారణంగా చాలా మంది ఎమ్మెల్యేలు.. తమ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుంటారు. ఎక్కడి వెళ్లిన చుట్టూ పదుల సంఖ్యలో కార్యకర్తలతో వెళ్తుంటారు. ఇక వారి కార్లలో అయితే ఉన్నత స్థాయి అధికారులు లేకపోతే వారి పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు, వారి బంధువులను మాత్రమే కూర్చోనిస్తుంటారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం అధికారులు, బంధువులు, నాయకుల కంటే ప్రజలే ముఖ్యమని భావిస్తుంటారు. ఆ కోవకు చెందిన ఎమ్మెల్యేనే.. అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్ధినులను తన కారులో ఎక్కించుకొని తానే స్వయంగా డ్రైవ్ చేసి వారిని స్కూల్ వద్ద దిగబెట్టారు. దీంతో ఎమ్మెల్యే పై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ప్రతి రోజూ ఉదయం ఆ నియోజకవర్గ ప్రజలను కలిసి వారిని పలకరించే వారు. అదే సమయంలో వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుని, సంబంధింత అధికారులకు చెప్పి.. వెంటనే పరిష్కరించే వారు. ఇలా ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కేతిరెడ్డికి మంచి గుర్తింపు వచ్చింది. గుడ్ మార్నింగ్ ధర్మవరం తో పాటు ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ అనే కార్యక్రమలో కూడా ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పాల్గొంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పట్టణంలోని 5వ వార్డులో పర్యటించారు. అయితే కార్యక్రమం ముగిసిన తరువాత ఎమ్మెల్యే కేతిరెడ్డి తన నివాసానికి బయలు దేరారు. అదే సమయంలో కొంత మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్ధినులు కళాజ్యోతి సర్కిల్ వద్ద ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు కాలినడకన వెళ్తున్నారు. విద్యార్ధినులను గమనించిన ఎమ్మెల్యే..కారులో ఉన్న వారిని దించి.. ఆ పిల్లలను కారులో ఎక్కించుకున్నారు. తానే స్వయంగా కారు డ్రెవింగ్ చేస్తూ పిల్లలను పాఠశాల వద్ద దింపారు. దీంతో ఎమ్మెల్యేనే తమను కారులో పాఠశాల వద్ద దింపడంపై విద్యార్ధినులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.