అందరి గొంతు తడిపే గంగ పేరు పెట్టుకున్న గంగ గొంతు ఎండిపోయింది. గంగ చెల్లి చిన్న తల్లి జీవితం చిన్నాభిన్నమైపోయింది. చదువు చెప్పే సరస్వతి పేరు పెట్టుకున్నందుకున్న సరిగా చదువుకునే పరిస్థితి లేదు. చదువు సంగతి దేవుడెరుక.. ముందు కడుపు నిండా అన్నం తినే భాగ్యం ఉండాలి కదా. గంగ, చిన్న తల్లి, సరస్వతి ముగ్గురూ అక్కాచెల్లెళ్లు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల జూట్ మిల్లు సమీపంలో ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఒక పూరి గుడిసె ఉంది. ఆ గుడిసెలో అమ్మ, నాన్నల ప్రేమ కరువైన ఈ ముగ్గురు చిన్నారులు దీన స్థితిలో జీవిస్తున్నారు. గంగ 8వ తరగతి చదువుతుండగా.. చిన్న తల్లి 4వ తరగతి, సరస్వతి 2వ తరగతి చదువుతున్నారు.
వీరి తండ్రి రాములు భిక్షాటన చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన భార్య కుటుంబ కలహాల కారణంగా వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తండ్రి చనిపోయాడు. ఆ సమయంలో ముగ్గురు చిన్నారులని వరసకు అమ్మమ్మ అయ్యే ఒక వృద్ధురాలు వీళ్ళని చేరదీసింది. ఆమె భిక్షాటన చేస్తూ ముగ్గురు చిన్నారుల కడుపు నింపేది. అయితే ఈమె కూడా 3 నెలల కిందట చిన్నారులని వదిలేసి వెళ్లిపోవడంతో మరోసారి పిల్లలు దిక్కు లేని వాళ్ళైపోయారు. మధ్యాహ్నం పాఠశాలలో భోజనం చేస్తూ.. ఉదయం, రాత్రి ఆంజనేయ స్వామి గుడిలో పూజారి ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకుంటూ ఆకలి తీర్చుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ చిన్నారులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అమ్మ ప్రేమ లేదు, నాన్న తిరిగి రాడు. ఉండడానికి సరైన ఇల్లు లేదు, కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు. మంచి భవిష్యత్తు అంతకంటే లేదు. ఇవన్నీ ఇస్తే చిన్నారుల ఆనందానికి అంతే ఉండదు. ప్రసాదంతో కడుపు నింపుకునే దుస్థితి నుంచి దూరం చేసి.. ఆ చిన్నారులకు అండగా నిలబడాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ చిన్నారుల దీనస్థితి సోషల్ మీడియాలో బాగా ప్రచారమవ్వగా.. పలువురు ముందుకొచ్చి అండగా నిలబడతామని హామీ ఇస్తున్నారు. పిల్లల సంరక్షణ, చదువు బాధ్యతలు తీసుకుంటూ కొంతమంది ముందుకొచ్చారు. చిన్న వయసులో ఇన్ని కష్టాలు అనుభవిస్తున్న ఈ చిన్నారుల కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.