చిన్న పిల్లలా, వృద్దులా అని అనవసరం , ఆడదైతే చాలు.. కామాంధులు కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. ఒక్కరు, కాదూ ఇద్దరు కాదూ పశువుల్లా ఓ గుంపు మహిళలపై మీద పడి.. కామ వాంఛను తీర్చుకుంటున్నారు. ఇటువంటి తాజా ఘటన కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.
కామాంధులు రెచ్చిపోతున్నారు. మాయ మాటలతో మభ్య పెట్టి లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారు. చిన్న పిల్లలు, ముదసలి అని చూడకుండా.. కళ్లు మూసుకు పోయి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఒక్కరు కాదూ ఇద్దరు కాదూ ఏకంగా ఐదుగురు ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన డాక్టర్ బీఆర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఐదుగురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురు నిందితును అరెస్ట్ చేసి వారిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక కుటుంబం నివసిస్తోంది. ఈ నెల 6న ఆమె బట్టలు ఉతికేందుకు సరుగుడు తోటల మధ్యకు వెళ్లింది. ఈ విషయాన్ని గుర్తించిన ఐదుగురు కామాంధులు.. ఆమెను వెంబడించారు. బాలికతో మాటలు కలిపారు. మాయ మాటలు చెప్పి పక్కనే ఉన్న గుబురు పొదల్లోకి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈనెల 6వ తేదీన ఈ విషయం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారం అనంతరం నిందితులు అక్కడ నుండి పారిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలిక చాలా కష్టంగా ఇంటికి చేరుకుంది. అయితే బాలిక పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు ఏమైందని ప్రశ్నించగా.. అసలు విషయాన్ని చెప్పింది. దీంతో వారు గ్రామ పెద్దలను కలిసి విషయం చెప్పారు.
అయితే అత్యాచారానికి పాల్పడ్డ ఐదుగురు యువకులు ఓ పార్టీకి చెందిన నాయకుల కుమారులున్నట్లు సమాచారం. దీంతో గ్రామ పెద్దలు .. కేసు పెట్టకుండా సెటిల్ చేసేందుకు బేరసారాలు ఆడినట్లు సమాచారం. దీన్ని వ్యతిరేకించిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో డీఎస్పీ వై.మాధవ రెడ్డి నేతృత్వంలోని బృందం విచారణ చేపట్టింది. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు సర్పంచ్ కుమారుడు ఓలేటి తేజ, ఓలేటి తులసిరావు , మల్లాడి వంశీ, ఓలేటి ధర్మరాజు, అర్థాని సత్తిపండులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు కాట్రేని కోన ఎస్ఐ పి.శ్రీనివాస్ తెలిపారు.
కోనసీమ జిల్లాలో సామూహిక అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డితో ఎపి చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. అధికార పార్టీకి చెందిన నేతల పిల్లలు అయినా సరే, వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా సరే కచ్చితంగా శిక్ష పడేలా చేయాలని కోరారు. అలాగే బాధితురాలికి అండగా ఉండాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. మహిళా కమిషన్ సభ్యురాలు జయశ్రీ కోరారు. మైనర్ అని చూడకుండా ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఈ కామాంధులను ఏం చేయాలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.