ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ రేట్ల వివాదం కొనసాగుతూనే ఉంది. సినిమా థియేటర్లపై దాడులు, నోటీసులు, సీజ్లు ఓవైపు కొనసాగుతుంటే.. మరోవైపు.. ఈ టికెట్ రేట్లతో థియేటర్లు నడపడం తమ వల్ల కాదంటూ కొందరు యజమానులు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. ఇక న్యాచురల్ స్టార్ నాని ఇటీవల టికెట్ ధరలు, థియేటర్ సీజ్ పై ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. థియేటర్ కలెక్షన్స్ కంటే కిరాణా షాపుల కలక్షన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయమై వైసీపీ మంత్రులు హీరో నానికి వరుస గా కౌంటర్ ఇస్తూ వస్తున్నారు.
తాజాగా, మంత్రి కొడాలి నాని కూడా హీరో నాని వ్యాఖ్యలు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సినిమా టికెట్ల రేట్లు ప్రభుత్వం ఎక్కడా తగ్గించలేదు. గతంలో కొన్ని సినిమాలకు రేట్లు పెంచాలని కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకునేవారు అని.. మా ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి ఉండకూడదని జీవో ఇచ్చిందని.. కానీ, మేం రేట్లు ఎక్కడా తగ్గించలేదు అని చెప్పారు మంత్రి కొడాలి నాని. సినీ పరిశ్రమలోని కొందరు కోర్టు అనుమతితో అడ్డంగా దోచుకునే అవకాశం లేకుండా తమ ప్రభుత్వం చేసిందన్నారు మంత్రి కొడాలి నాని. సినిమా టికెట్ రేట్ తగ్గితే ఎగ్జిబిటర్లకు నష్టం అని చెబుతున్నారని మండిపడ్డారు.
ఇది చదవండి : మాస్క్ ధరించలేదని విమానంలో వృద్దుడిని చితకబాదిన మహిళ
ఎగ్జిబిటర్ను అడ్డం పెట్టుకుని సినిమా టికెట్ల విషయంలో కొంతమంది గేమ్ ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొడాలి నాని. మేం చేస్తోన్న దాని వల్ల ఎగ్జిబ్యూటర్ కు ఏలాంటి నష్టం లేదని అన్నారు. ఇక కిరాణా కొట్టుకు వస్తున్న ఆదాయం కూడా సినిమా థియేటర్స్కు రావడం లేదని కొందరు అంటున్నారు. అంత ఆదాయం లేకపోతే సినిమా థియేటర్స్ యజమానులు కిరాణా కొట్టు పెట్టుకుంటారు కదా అని హీరో నాని వ్యాఖ్యలపై కొడాలి నాని కౌంటర్ వేశారు. కావాలనే కొందరు రాష్ట్ర ప్రభుత్వం బురద చల్లుతున్నారు.