శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అని చెప్పినట్లుగా సాధించాలనే పట్టుదల ఉన్నట్లైతే ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చు. ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకుని జీవితంలో మీకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవచ్చు. అలానే ఓ యువకుడు తన పేదరికాన్ని జయించి ఐఎఎస్ సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు.
జీవితంలో ఏదైనా సాధించాలంటే దానికి తగిన కృషి చేయాలి. నీ పేరు నలుగురు చెప్పుకోవాలన్నా, చరిత్రలో నీకంటూ ఓ పేజీ ఉండాలన్నా అలుపెరుగని పోరాటం చేయాల్సిందే. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని లక్ష్య సాధనలో ముందుకు సాగిపోవాలి. ప్రస్తుత సమాజంలో చాలా మంది యువత అందివచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ఉన్నత శిఖరాలను చేరుకుంటున్నారు. ఇదే రీతిలో పేపర్ బాయ్ గా పనిచేసిన ఓ యువకుడు ఆ తరువాత కష్టపడి చదివి ఐఎఎస్ సాధించారు. తను కలగన్న జీవితాన్ని నిర్మించుకున్నారు.
దేశంలో అత్యున్నత సర్వీసులైనా ఐఎఎస్, ఐపిఎస్ సాధించాలని యువత కలలకంటుంది. కానీ అది అంత సులువైన పనికాదు. దానికి నిరంతరం కఠోర శ్రమ అవసరం. కొంత మంది లక్ష్యసాధనలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికి వాటిని అదిగమించి అనుకున్నది సాదిస్తారు. వారే సమాజంలో విజేతలుగా నిలుస్తారు. అలా కష్టాలను ఎదుర్కొని సమాజ సేవ చేయాలనే సంకల్పంతో ఐఎఎస్ సాధించారు లక్ష్మీశా. అయితే తన జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఐఎఎస్ లక్ష్మీశా తల్లిదండ్రులు కూలీ పనులు చేసి వారిని చదివించారని తెలిపారు.
వారు కడుపులు మాడ్చుకుని మా కడుపులు నింపే వారని తెలిపారు. చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి పొలం పనులకు వెళ్లేవాడినని, 300 రూపాయల వేతనంతో పేపర్ బాయ్ గా పనిచేశానని చెప్పారు. ఐఎఎస్ సాధించక ముందు తాను వ్యవసాయ శాస్త్రవేత్తగా, ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ గా పనిచేశానని చెప్పారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో 2009లో సివిల్స్ రాశానని అప్పుడు ఆశించిన ఫలితం రాలేదని తెలిపారు. ఆ తరువాత 2010లో ఐఎఎఫ్ కు ఎంపికయ్యానని తెలిపారు. విధులు నిర్వహిస్తూనే 2013లో మళ్లీ సివిల్స్ రాసి 275వ ర్యాంకు సాధించి ఐఎఎస్ గా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు ఎంపికయ్యానని లక్ష్మీశా తెలిపారు.