గత కొన్ని రోజులుగా ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే విషయంలో ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ఇక జనసేన పార్టీ అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. పలు పోరాటాలు కూడా మొదలు పెట్టింది. ఈ క్రమంలో జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని గట్టి పట్టుదలమీదనే ఉంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో బిజీగా కొనసాగుతున్నారు. ఇక ఏపి రాజకీయాలు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రభుత్వంపై ప్రెస్ మీట్లు పెట్టి మరీ కడిగి పారేస్తుంటారు. ఆ మద్య జగన్ ప్రభుత్వానికి మద్దతు పలికిన ఆయన ఇటీవల స్టాటజీ మార్చుకున్నట్లు కనిపిస్తుంది.
ఈ క్రమంలోనే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై కుండబద్దలు కొట్టారు. 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఉన్నంత దయనీయ పరిస్థితి ఎప్పుడూ లేదని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలియకూడదు అన్న దోరణిలో ఉన్నట్టు కనిపిస్తుందని వ్యాఖ్యనించారు. కోట్లు అప్పులు చేసి ఏం సాధిద్దామనుకున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వంపై విమర్శించే తీరు ఉండవల్లి అరుణ్ కుమార్, పవన్ కళ్యాణ్ అభిప్రాయాలు ఒకే విధంగా ఉండటంతో ఇప్పుడు ఆయన్ని జనసేనలోకి ఆహ్వానించే అవకాశం ఉందని ఏపి రాజకీయాల్లో టాక్ వినిపిస్తుంది. ఏపిలో జనసేన పార్టీని పటిష్టం చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. యువతను, మేధావులను కూడా సమీకరిస్తానని.. ఇటీవల మంగళగిరి పర్యటనలో పవన్ ఉద్ఘాటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఉండవల్లి రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉండే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉంచుకొని ఆయన్ని జనసేన పార్టీలోకి ఆహ్వానించినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. ప్రభుత్వంపై ఉండవల్లి వ్యాఖ్యల తర్వాత పవన్ కల్యాణ్ లో ఆలోచన మొదలయిందంటున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి రాజకీయంగా మళ్లీ పుంజుకుంటారా? వచ్చినా.. పవన్ పార్టీలోకి వస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఉండవల్లి గనక జనసేన పార్టీలోకి వస్తే పవన్ కళ్యాణ్ కి మరింత బలం పెరుగుతుందని.. పవన్ ఐడియాలు ఉండవల్లి లాంటి వ్యక్తులు కుండబద్దలు కొట్టే విధంగా మాట్లాడగలుగుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ప్రత్యక్ష రాజకీయాలకు ఉండవల్లి ఎప్పుడో గుడ్ బై చెప్పేశారని, ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తే గౌరవ సలహాదారుగా ఉండవొచ్చని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. మరి భవిష్యత్ లో ఏపి రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూడాలి. తాజాగా ఉండవల్లి గురించి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
A snippet of Sri ’Undavalli Arun Kumar ji’s press meet on the disastrous financial situation of AP & how the AP Govt lacks transparency in Governance. ‘ఉండవల్లి’గారి లాంటి రాజకీయ ఉద్ధండులు ఈ మాట మాట్లాడుతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.
(clip 1) pic.twitter.com/ctvz81LXII— Pawan Kalyan (@PawanKalyan) October 12, 2021