స్నేహానికన్న మిన్నా.. లోకాన లేదురా.. అంటూ సాగిన వారి స్నేహం ఇప్పుడు బీటలు వారుతుందా.. వేర్వేరు పార్టీలో కొనసాతున్నా కూడా వారి స్నేహం ఏనాడూ చెక్కు చెదరలేదు… అలాంటిది వీరి మద్య గ్యాప్ పెరిగింది.. ఇంతకీ ఆ స్నేహితులు ఎవరా అనుకుంటున్నారా.. మంత్రి నాని, వంగవీటి రాధ. అయితే వంగవీటి రాధా.. కొడాలి నాని మద్య ఏం జరిగింది.. ఒకప్పుడు ప్రాణానికి ప్రాణం ఇచ్చే మిత్రుల మద్య ఏం తేడా వచ్చింది..? ఇప్పుడు ఎవరి దారి వారిదే.. అనే పరిస్థితులు ఎందుకు వచ్చాయి..? అయితే గుడివాడ పాలిటిక్స్ పై ఈ ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుంది.. అనే అంశంపై ఇప్పుడు విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి. విజయవాడ రాజకీయాల్లో వంగవీటి ఫ్యామిలీకి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. గెలిచినా.. ఓడినా ఆ ఫ్యామిలీకి కాపు సామాజికవర్గంలో ఫాలోయింగ్ అదే విధంగా కొనసాగుతూ వస్తోంది. వంగవీటి రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ రాజకీయ ప్రయాణం మాత్రం ఎవరికీ అర్థంకాని విధంగా ఉంటూ వచ్చింది. మొదట కాంగ్రెస్, ఆ తరువాత పీఆర్పీ, ఆ తరువాత వైసీపీలో చేరిన వంగవీటి రాధా… గత ఎన్నికలకు ముందు టీడీపీ చేరి అక్కడే కొనసాగుతున్నారు. ఇక గుడివాడ నియోజకవర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగి ఇప్పుడు సీఎం జగన్ మంత్రి వర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గా కొనసాగుతున్నారు కొడాలి నాని.
ఇదిలా ఉంటే.. స్థానిక మంత్రి కొడాలి నానికి రాధ దూరంగా ఉంటూ.. తన నేతలతో రహస్య మంతనాలు జరపడంపై కృష్ణా జిల్లాలో సర్వత్రా రాజకీయ చర్చనీయాంశంగా మారింది. వంగవీటి రాధ గుడివాడలో కాపు సామాజిక నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. గతంలో ఇలాంటి సమావేశాలు జరిగితే ఖచ్చితంగా కొడాలి నాని ఉండేవారు.. అయితే ఇటీవల సమావేశాల్లో కొడాలి నానిని దూరంగా పెడుతున్నపరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం.. అందుతున్న సమాచారం మేరకు గుడివాడలో కాపు సామాజిక వర్గం వారు కొడాలి నానిపై కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. గుడివాడలో కాపు సామాజిక వర్గంతో వంగవీటి కుటుంబానికి చాలా కాలంగా మంచి సంబంధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. వారంతా ఏక పక్షంగా వంగవీటి కుటుంబానికి మద్దతు ఇచ్చే పరిస్థితి. అయితే రాధ తో స్నేహ సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలో కొడాలి నానికి మద్దతు ఇస్తూ వస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి తీరు మారిందని.. మమ్ముల్ని పట్టించుకోవడం లేదని తమ అసంతృప్తిని రాధ దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తన సన్నిహితులకంటే ఎవరూ ఎక్కువ కాదు.. తమ కుటుంబానికి మద్దతు ఇస్తున్న వారి ప్రయోజనాల కంటే తనకు ఏదీ ఎక్కువ కాదు అంటూ స్నేహబంధాన్ని కూడా పక్కకు పెట్టేందుకు సిద్దమే అని సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే తరుచూ గుడివాడలో తరుచూ పర్యటిస్తూ కాపు సామాజిక వర్గ నేతలతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఈ రహస్య మంతనాల సారంశం ఏంటంటే.. రాబోయే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచేందుకు సన్నాహాలు సిద్దం చేస్తున్నట్లు కనిపిస్తుంది.. ఇందుకు స్థానిక కాపు నేతలు ఆయనపై వత్తిడి తీసుకు వస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇంకా స్పష్టం కాలేదు.. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం గుడివాడ బరిలో రాధ తప్పకుండా పోటీ చేయాల్సిందే అన్నట్లుగా కాపు సామాజిక వర్గం వారు కోరుతున్నట్లు తెలుస్తుంది. అయితే దశాబ్దాల కాలంగా తమకు సన్నిహితంగా ఉంటూ.. అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్న కాపు సామాజిక వర్గం ప్రయోజనాలు కాపాడటం కోసం రాధ ఏ వైఖరి అవలంభిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. మరోవైపు వంగవీటి రాధ మాత్రం తన సన్నిహితుల ప్రయోజనాలు కాపాడటం కోసం ఏ త్యాగానికైనా సిద్దమే అని తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు తెలుస్తుంది. కాగా, ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తే.. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి వంగవీటి రాధ బరిలో నిలబడతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని.. వంగవీటి రాధ మద్య బీటలు వారిందా అని గుడివాడ రాజకీయ వర్గాల్లో తెగ చర్చలు నడుస్తున్నాయి.