టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంట సంబరాలు మొదలయ్యాయి. భూమా అఖిలప్రియ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. విషయాన్ని ఆమె భర్త భార్గవ రామ్ స్వయంగా ప్రకటించారు. భూమా అఖిలప్రియ తన బిడ్డతో ఉన్న ఫోటోలు షేర్ చేసి.. మగ బిడ్డ పుట్టింది అంటూ ఆయన పేర్కొన్నారు. తల్లి శోభానాగిరెడ్డి జయంతి రోజునే అఖిలప్రియ కుమారుడికి జన్మనివ్వడం విశేషం. భూమా నాగిరెడ్డి మళ్లీ ఇలా పుట్టారంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా, భూమా అఖిల ప్రియ మంత్రిగా ఉన్న సమయంలో భార్గవ రామ్ ను వివాహం చేసుకున్నారు.
ఇటీవల హైదరాబాద్లోని భూ వివాదంలో ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన కేసులో అఖిల అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజుల పాటూ అఖిలప్రియ భర్త అజ్ఞాతంలోకి వెళ్లారు. అలాగే కర్నూలు జిల్లాలో కూడా ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లు కేసు నమోదైంది. భూమా అఖిలప్రియ తన తల్లి మరణంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2014లో వైఎస్సార్సీపీ తరపున ఆళ్లగడ్డ నుంచి పోటీచేసి విజయం సాధించారు.. తండ్రి నాగిరెడ్డి నంద్యాల నుంచి గెలుపొందారు.
ఇదీ చదవండి : దేశంలో స్వల్పంగా పెరిగిన కోవిడ్ కేసులు!
ఆ తర్వాత చంద్రబాబు తన కేబినెట్లో అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చారు.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీచేసిన అఖిలప్రియ ఓడిపోయారు. ఎన్ని వివాదాలు చుట్టుముట్టిన భూమ కుటుంబానికి నియోజకవర్గంలో మంచి ఆదరణ ఉంది.