అమరావతి: రాష్ట్రంలో రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న ‘జగనన్న చేదోడు’ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. జగనన్న చేదోడు కింద 2.85 లక్షల మందికి సాయం చేస్తున్నామని తెలిపారు. 2,85,350 మంది బ్యాంక్ ఖాతాల్లో రూ. 285.35 కోట్లను జమ చేస్తున్నామని పేర్కొన్నారు.
జగనన్న చేదోడు పథకం ద్వారా షాపులున్న 1,46,103 మంది టైలర్లకు రూ.146.10 కోట్లు, షాపులున్న 98,439 మంది రజకులకు రూ.98.44 కోట్లు, షాపులున్న 40,808 మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40.81 కోట్లు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం రూ.583.78 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. లంచాలకు, వివక్షకు తావులేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా నుంచి సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. పాత అప్పులకు జమచేసుకోలేని విధంగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.