ఏపిలో అసెంబ్లీ రెండోరోజు సమావేశం వాడీ వేడిగా సాగింది. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య కామెంట్లు, కౌంటర్లు నడిచాయి. అంబటి రాంబాబు, చంద్రబాబు మధ్య వాగ్వాదం నడిచింది. ఇదిలా ఉంటే సభలో జరిగిన పరిణామాలపై చంద్రబాబు తీవ్ర మనస్తాపం చెందారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో బావేద్వేగానికి గురయ్యారు. సభలో ఎన్నో చర్చలను చూశామని… కానీ ఇంత దారుణంగా సభ జరగడాన్ని ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని… అంతవరకు సభలో అడుగుపెట్టబోనని అన్నారు. ఆ తర్వాత ఆయన నేరుగా టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కంటతడి పెట్టారు. రెండు నిమిషాల పాటు ఆయన తీవ్ర బావోద్వేగానికి గురయ్యారు. రెండు నిమిషాల పాటు మాట్లాడలేకపోయారు.
తాను ప్రజల కోసమే పోరాటం చేశానని చెప్పారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ఇవాళ నా భార్యను కించపరిచేలా దూషించారని కంటతడి పెట్టారు. ఆమెకు తన గురించి తప్ప మరో ఆలోచన లేదని చెప్పారు. భువనేశ్వరి ఇల్లు దాటి ఎప్పుడూ బయటకు రాలేదని అన్నారు. ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సంక్షోభం వచ్చినా ఆమె తనకు అండగా నిలిచారని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీ గౌరవసభలా కాకుండా అగౌరవసభలా మారిందని చంద్రబాబు అన్నారు. ప్రస్తుత స్పీకర్ తమ్మినేని కూడా ఇప్పుడు తనకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదని విమర్శించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం తన ప్రవర్తనపై కూడా ఆలోచించుకోవాలి. మాట్లాడుతుండగానే నా మైక్ కట్ చేశారు.
గతంలో తెదేపా ప్రభుత్వంలో తమ్మినేని మంత్రిగా పనిచేశారు. గౌరవంగా బతికేవాళ్లను కూడా కించపరుస్తున్నారు. 40 ఏళ్లు పనిచేసింది.. ఇలా అవమానపడటానికా? అని బాధపడుతున్నా. అవతలివారు బూతులు తిడుతున్నా.. సంయమనం పాటిస్తున్నా. నాకు బూతులు రాక.. తిట్టలేక కాదు.. అది మా విధానం కాదు అని చంద్రబాబు అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రతిపక్షంపై నీచమైన మాటలు మాట్లాడలేదని చెప్పారు. గతంలో రాజశేఖరరెడ్డి కూడా తన గురించి ఒక మాట మట్లాడారని… కానీ ఆ తర్వాత మేము కలిసినప్పుడు తనకు క్షమాపణ చెప్పారని అన్నారు. ఇవాళ్టి ఘటనలను ఏవిధంగా అభివర్ణించాలో అర్థం కాలేదు. టీడీపీ నేతలను, కార్యకర్తలను తిట్టడం వైసీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు.