ప్రభుత్వ ఉద్యోగానికి యువతలో ఉన్న క్రేజే వేరు. ప్రైవేట్ కొలువులో ఎన్ని లక్షల జీతాలు వచ్చినా సరే.. దాన్ని వదులుకుని.. ప్రభుత్వం ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఎందరో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి భద్రతతో పాటు.. ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. అయితే గవర్నమెంట్ జాబ్ సాధించడం అంత తేలిక కాదు. కొద్ది మందికి మాత్రమే తొలి ప్రయత్నంలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది.
ఇక చాలా మంది గవర్నమెంట్ జాబ్ కోసం ఏళ్ల పాటు చదువుతూనే ఉంటారు. అయితే మరి కొందరు ఒకటి, రెండు ప్రయత్నాలు చేసి వదిలేస్తారు. కానీ కొందరు మాత్రం పట్టువదలని విక్రమార్కుల మాదిరి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. చివరకు అనుకున్న లక్ష్యం నేరవేర్చుకుంటారు. ఈ కోవకు చెందిన మహిళే దాట్ల కీర్తి. చిన్ననాటి నుంచి ఆమెకు కలెక్టర్ కావాలన్నది కోరిక. అందుకోసం ఏళ్ల తరబడి కష్టపడింది. ఎట్టకేలకు అనుకున్న లక్ష్యం నేరవేర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్-1, 2018 ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికైన దాట్ల కీర్తి సక్సెస్ స్టోరీ మీకోసం..
విశాఖ జిల్లాకు చెందిన కీర్తి చిన్నప్పటి నుంచి మంచి మెరిట్ మార్కులతో ఉత్తీర్ణత అవుతూ వచ్చేది. ఆమె తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు. తల్లి నిర్మల ప్రాథమిక పాఠశాలలో హెచ్ ఎంగా పనిచేస్తున్నారు. తండ్రి జగన్నాథ రాజు జెడ్పీహెచ్లో స్కూల్ అసిస్టెంట్ పనిచేసి ఇటీవల రిటైర్మెంట్ అయ్యారు. ఇక కీర్తి ఇంటర్ తర్వాత విజయనగరంలో బీఎస్సీ పూర్తి చేశారు. ప్రతి ఒక్కరూ చదువు పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు. కీర్తి దాట్ల కూడా అదే ప్రయత్నం మొదలు పెట్టింది.. కానీ అది ఐఏఎస్ కావడానికి.. ఇందుకోసం గ్రూప్ -1 ని ఎంచుకుంది.
కృష్టి.. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం అన్న చందంగా మొదట దాట్ల కీర్తి మొదట డీఎస్సీలో మంచి ర్యాంక్ సంపాదించి స్కూల్ అసిస్టెంట్గా ఎంపికయ్యారు. టీచర్ జాబ్ చేస్తున్నా ఆమె లక్ష్యాన్ని మాత్రం వీడలేదు. ఓ పక్క టీచర్ గా పనిచేస్తూనే మరోవైపు గ్రూప్-1 కోసం కృషిచేశారు. పాఠశాల ముగిసిన వెంటనే చదువుకోవడంలో నిమగ్నమయ్యేవారు. ఈ క్రమంలో కీర్తి వివాహం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఏమాత్రం వెనుకాడకుండా గ్రూప్-1కి ప్రిపేర్ అయ్యింది.
ఆమె జిల్లా బీసీ సంక్షేమ అధికారిగా ఎంపిక అయ్యారు. ఈ క్రమంలో ఆమె ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారిణిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆమె కలెక్టర్ కావాలన్న ఆశయం మాత్రం విడవకుండా సెలవు రోజుల్లోనూ, ఖాళీ సమయాల్లోనూ గ్రూప్-1కు సాధన చేసేవారు. మొత్తానికి కీర్తి ఆర్డీఓ అవ్వాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.