ఏపీలో సినిమా టికెట్ల ధరలపై కొంతకాలంగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీన్ని పరిష్కరించేందుకే ఏపీ ప్రభుత్వం ఓ స్టీరింగ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈ రోజు ఉదయం సచివాలయంలో భేటీ అయి, సినిమా టికెట్ల వివాదం, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించింది. సినిమా టికెట్ ధరలకు సంబంధించి కమిటీ ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. కార్పొరేట్, మున్సిపాలిటీ, నగర పంచాయితీలకు టికెట్ రేట్లు ఖరారు చేసింది. మల్టీప్లెక్స్ తో పాటు అన్ని థియేటర్లకు మూడు కేటగిరీల్లో సినిమా టికెట్ల ధరలు ఖరారు చేసింది.
గ్రామ పంచాయతీల్లోని ప్రత్యేక వసతులు ఉన్న థియేటర్లకు స్పెషల్ కేటగిరీ ఇచ్చేందుకు కమిటీ అంగీకరించింది. అలానే ఎకానమీ క్లాస్ సినిమా టికెట్ల రేట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. స్పెషల్ షోకు నో చెప్పింది. పెద్ద, చిన్న అన్ని చిత్రాలకు ఒకటే ధర నిర్ణయించినట్లు తెలిపింది. అలానే ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ రేట్లను తగ్గించి అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. ఆన్లైన్ టికెటింగ్కు సత్వర ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం అమలులో ఉన్న 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనను ఎత్తివేసి.. 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చింది. రాత్రి కర్ఫ్యూ తొలగింపుతో పాత సమయాల్లోనే 4 ఆటలకు అనుమతి ఇచ్చింది. టికెట్ రేట్లపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనున్నుట్లు కమిటీ తెలిపింది. ఈ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం వెల్లడించనుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.