ఇరు తెలుగు రాష్ట్రాలపై సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి భగభగలకు ప్రజలు తట్టుకోలేక ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు పోటాపోటీగా మండిపోతున్నాయి. తెలంగాణలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే.. అదే ఆంధ్రప్రదేశ్లో 45 డిగ్రీలు నమోదైంది. దీన్ని బట్టే తెలుగు స్టేట్స్పై భానుడి ప్రతాపం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మరో రెండ్రోజులు ఏపీ, తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇళ్లలో నుంచి అస్సలు బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఎండలను తట్టుకోలేక జనాలు సతమతం అవుతుంటే.. రాబోయే రెండ్రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. అంతేగాక జూన్ నెల ఫస్ట్ వీక్ మొత్తం సగటు ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో ఈ స్థాయిలో ఎండలకు వాయువ్య, పశ్చిమ దిశల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న బలమైన గాలులు ప్రధాన కారణమని వాతావరణ శాఖ చెప్పింది. రాష్ట్రంలో అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలను చూసుకుంటే.. గరిష్టంగా రామగుండంలో 42.8 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా మెదక్లో 24.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. మరోవైపు మండుతున్న ఎండలతో ఏపీ కూడా భగ్గుమంటోంది. ఏపీలోని జిల్లాల్లో సగటున 44 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆది, సోమవారాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా పనులు ఉంటే పొద్దున లేదా సాయంత్రం పూట చేసుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు.