దేశంలో కరోనా సమయంలో ఎన్నో అమానవీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. అందరూ ఉన్నా చనిపోయిన వారు అనాథ శవాల్లో మిగిలిపోయారు.. వైద్యసిబ్బంది, పారిశుద్ద్య కార్మికులు వారికి అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు కరోనా ప్రభావం లేదు.. కానీ ఓ మహిళ చనిపోయి అయినవాళ్లు ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోని దుస్థితి నెలకొంది. కానీ ఆమెకు అంగన్ వాడీ కార్యకర్తలు అన్నీ తామే అయి పాడెమోసి అంత్యక్రియలు చేశారు. ఈ హృదయవిదారకమైన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కృష్ణా జిల్లా మచిలీపట్నం కి చెందిన సౌజన్య అనే వివాహిత మరణించింది. అయినవాళ్లు ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోని దుస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులు ఎవరూ కనీసం సౌజన్య మృతదేహాన్ని కూడా చూసేందుకు రాలేదు. పెద్దల సాక్షిగా నిండు నూరేళ్లు తోడూ నీడగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త కూడా ఆమెను చూడటానికి రాలేదు. అలాంటి పరిస్థితిలో సౌజన్య అంత్యక్రియలు జరిపించేందుకు అంగన్వాడి కార్యకర్తలు ముందుకు వచ్చి తమ గొప్ప మనసు చాటుకున్నారు.
మనుషుల్లో ఇంకా మానవత్వం చావలేదని ఈ ఘటన ద్వారా తెలుస్తుంది. అనాధ శవంలా ఉన్న సౌజన్యకు అంగన్ వాడి కార్యకర్తలు అంత్యక్రియలు నిర్వహించి ఓ మహిళకు సాటి మహిళలే తోడు ఉంటారని అందరికీ తెలియజేశారు. సౌజన్యకు అన్నీ తామై అంగన్వాడీ కార్యకర్తలు అంతిమయాత్ర నిర్వహించారు.
సౌజన్య పార్థీవ దేహాన్ని తమ భుజాన మోస్తూ స్మశానానికి చేరుకున్నారు. దహన సంస్కార కార్యక్రమాలు దగ్గర ఉండి నిర్వహించారు. ఆడవారైనా ఇంత గొప్పగా వ్యవహరించినందుకు అందరూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.