ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయలు, ఇంధన ధరలు పెరిగి.. సామాన్యులను బెంబెలెత్తిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో పాల ఉత్పత్తులు కూడా చేరనున్నాయి. విజయ పాల ధర పెరగనుంది. ఆ వివరాలు..
నిత్యవసరాల ధరలు, కూరగాయలు, ఇంధన ధరలు చుక్కలను తాకుతున్నాయి. వేసవి కాలం ప్రారంభం కావడంతో కూరగాయల ధరలు కొండెక్కాయి. ఇది చాలదన్నట్లు.. వీటి జాబితాలోకి పాలు కూడా చేరాయి. ప్రభుత్వం పాల ధర పెంచుతూ.. నిర్ణయం తీసుకుని ప్రజలకు షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో విజయ పాల ధర పెంచుతూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతుల పాల సేకరణ ధరలు, నిర్వహణ, రవాణా ఖర్చులు పెరగడతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పెరిగిన ధరలు మార్చి 1 అనగా బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
ఇక మార్చి 1 నుంచి విజయ పాల ధర అర లీటరు ప్యాకెట్పై 1 రూపాయి చొప్పున పెరగనుంది. అయితే ఈ పెరుగుదల కేవలం ఆరు రకాల ప్యాకెట్లకు మాత్రమే వర్తిస్తుందని కృష్ణా మిల్క్ యూనియన్ ఒక ప్రకటనలో తెలిపింది. పెరుగు, చిన్న పాల ప్యాకెట్లు, ఇతర పాల పదార్థాల ధరల్లో ఎటువంటి మార్పు ఉండదని కృష్ణా మిల్క్ యూనియన్ వెల్లడించింది. అంతేకాక నెలవారీ పాల కార్డుదారులకు మార్చి 9 వరకు పాత ధరలే వర్తిస్తాయని తెలిపారు.
మార్చి 1 నుంచి ఏపీలో అర లీటరు విజయ లోఫ్యాట్ (డీటీఎం) ధర రూ. 27 కాగా.. ఎకానమీ (టీఎం) రూ. 29.. అలాగే ప్రీమియం (స్టాండర్డ్) రూ. 31.. ఇక స్పెషల్ (ఫుల్ క్రీమ్) రూ. 36, గోల్డ్ రూ. 37, టీ-మేట్ రూ. 34గా ఉండనుంది. దేశంలో అన్ని యూనియన్లు రేట్లను పెంచిందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పాలు, పాల ఉత్పత్తుల గరిష్ట విక్రయ ధరలను స్వల్పంగా సవరించామని చెబుతున్నారు మిల్క్ యూనియన్ సభ్యులు. ప్రజలు దీనికి సహకరించాలని కోరారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.