వారిది ఎంతో అందమైన కుటుంబం.. భార్యాభర్త, ఇద్దరు పిల్లలు. చిన్న కుటుంబం- చింతలేని కుటుంబం. ఎంతో సంతోషంగా సాగుతున్న వారి జీవితాలు చూసి కాలానికే కన్ను కుట్టినట్లు ఉంది. ఆ అందాల పొదరింట్లో అంతులేని విషాదం చోటుచేసుకుంది. తెల్లారితే కార్తీక పూజ చేసుకుందామని ఏర్పాట్లు చేసుకుని పడుకున్న వాళ్లు మళ్లీ లేవలేదు. ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ, మంటలు ఇల్లు మొత్తం కమ్మేశాయి. తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లీకూతుళ్ల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన స్థానికులను సైతం ఆందోళనకు గురి చేసింది.
ఈ విషాద ఘటన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగింది. నవర మల్లేశ్వరరావు అలియాస్ నానాజీ అనే బంగారు వ్యాపారికి అంబికా జ్యూయలర్స్ అనే దుకాణం ఉంది. దుకాణంపైనే రెండంతస్థుల డూప్లెస్ హౌస్లో నివాసం ఉంటున్నారు. శనివారం ఆయన భార్య సుజాత, కుమార్తె జాహ్నవి, కుమారుడు మౌలేష్(19) సరదాగా గడిపారు. కార్తీక పూజ కోసం పిల్లల్ని కాలేజీల నుంచి ముందురోజే రప్పించారు. జాహ్నవి మాకవరపాలెంలోని ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. కుమారుడు విశాఖలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి అందరూ చక్కగా కబుర్లు చెప్పుకున్నారు. కలిసి కూర్చొని సరదాగా గడిపారు.
కుమార్తె జాహ్నవి మొదటి అంతస్థులో పడుకోగా.. నానాజీ, సుజాత, మౌలేష్ పైఅంతస్థులో నిద్రపోయారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో దట్టమైన పొగ, మంటలు వ్యాపించాయి. ఇంట్లో వారికి ఏం జరుగుతోందో అర్థంకాలేదు. ఎటు చూసినా పొగ.. ఎటూ వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. నానాజీ వెంటనే పక్కనే ఉన్న తన సోదరుడికి కాల్ చేశాడు. ఇంట్లో మంటలు వ్యాపించాయి కాపాడండి అంటూ తెలిపాడు. అతని సోదరుడు వచ్చి కాపాడేందుకు వీలు లేకుండా పోయింది. మొత్తం నాలుగు అంతస్థుల్లో అన్ని తాళాలు వేసి ఉండటంతో వారిని కాపాడేందుకు వీలు కాలేదు. నానాజీ సోదరుడు అగ్నిమాపక శాఖ వారికి ఫోన్ చేయగా.. హుటాహుటిన వచ్చి వాళ్లు తాళాలను కట్ చేసి పైకి వెళ్లారు.
పైకి వెళ్లి చూడగా.. అప్పటికే నానాజీ, మౌలేష్ అక్కడికక్కడే మరణించారు. భార్య సుజాత, కుమార్తె జాహ్నవి అపస్మారకస్థితిలో ఉన్నారు. చికిత్స నిమిత్తం వారిని విశాఖ కేజీహెచ్కు తరలించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది పైకి వెళ్లే సరికే నానాజీ ఊపిరాడక మరణించి ఉన్నాడు. మౌలేష్ కొనఊపిరితో ఉండగా.. తాళ్ల సాయంతో కిందకి దించేందుకు ప్రయత్నించారు. అలా కిందకు దించుతుండగానే మౌలేష్ తుదిశ్వాస విడిచాడు. తల్లీకుమార్తెల పరిస్థితి మాత్రం విషమంగా ఉందని తెలిపారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిరా. విద్యుత్ శాఖ అధికారులు ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్గా ధ్రువీకరించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.