ఓ రైతు పొలం కంచె కొరకు తీసుకొచ్చిన ఒక్క మొక్క నేడు 80 ఎకరాలకు విస్తరించింది. ఆ రైతుకు కాసుల పంట పండింది. దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం..
కొందరికి అదృష్టం అనుకోకుండా కలిసి వస్తుంది. అది ప్రకృతి పరంగా కావొచ్చు.. మరేవిధంగా కావచ్చు. ఇటీవల టమాటా రైతుల గురించి మాట్లాడుకుందాం.. మార్కెట్లో సరైన ధర లేక కన్నీళ్లు పెట్టుకునే రైతులు కేవలం రెండు నెలల్లో కొందరు లక్షాధికారులు, కోటీశ్వరులు అయిన విషయం తెలిసిందే. కొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతున్న సంఘటనలు చూస్తున్నాం. అలాంటిదే ఓ రైతు పొలం కంచె కోసం తెచ్చిన ఓ మొక్క ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బాపట్ల జిల్లా మండలకేంద్రం కొరిశపాడుకు చెందిన కడివేటి జగన్నాథరెడ్డి అనే రైతు ఉన్నాడు. అతను కొన్ని సంవత్సరాల క్రితం కాశీకి వెళ్లాడు. అక్కడి నుంచి కొన్ని మొక్కలను తెచ్చాడు. అందులో ఒకటి వాక్కాయ మొక్క ఉంది. ఈ మొక్కకు ముళ్లు ఎక్కువగా ఉంటాయి. అందుకని కంచెగా వేయడానికి తీసుకువచ్చాడు. జగన్నాథరెడ్డి సోదరుడు విశ్వనాథరెడ్డి తన పొలంలో గట్టుపై ఒక మొక్కను నాటాడు. ఆ మొక్క ఎదిగిన తర్వాత దానికి వచ్చిన కాయలను విత్తనాలుగా చేసి మొదట ఒక ఎకరం పొలంలో సాగు చేశాడు. దీంతో మెల్లగా లాభాలు రావడంతో 12 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. ఈ మొక్కలను ఒక ఎకరం భూమిలో 200 మొక్కలు నాటవచ్చు. మొదటి సంవత్సరం దిగుబడి తక్కువగా ఉన్నా చెట్టు పెరిగే కొలది దిగుబడి పెరిగిందని రైతు తెలిపాడు.
రెండు సంవత్సరాల తర్వాత ఒక చెట్టుకు 25 నుంచి 30 కిలోల వాక్కాయలు వచ్చాయని తెలిపాడు. ఒక ఎకరానికి సుమారు 5 నుండి 6 టన్నుల దిగుబడి వస్తుందని వెల్లడించాడు. ఈ వాక్కాయలకు ప్రస్తుతం మార్కెట్ ధర కిలో రూ. 50 ఉంది. ఇది అడవిజాతి మొక్క కావడంతో నీటి సరఫరా ఏడాదికి మూడుసార్లు అందిస్తే సరిపోతుంది. పెట్టుబడి ఖర్చు తక్కువగా అవుతుంది. పూత సమయంలో పురుగు రాకుండా మందులు వాడితే అధిక దిగుబడి వచ్చే చాన్స్ ఉంది. విజయవాడ, కోల్కతా నుంచి వ్యాపారులు తోట వద్ద కొనుగోలు చేస్తున్నారు. బేకరీల్లో ఉండే చెర్రీ పండ్లను వీటితో తయారుచేస్తారు. ఈ సందర్భంగా కొరిశపాడు గ్రామానికి చెందిన మహిళా రైతు ఎం. సునందన మాట్లాడుతూ.. తమ పొలంలో పండిన వాక్కాయలతో పచ్చళ్లు తయారుచేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా వీటిని చింతపండుకు ప్రత్యామ్నాయంగా కూడా వాడవచ్చని ఆమె తెలిపారు.
రైతు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ.. కంచె కోసం ఈ మొక్కను తీసుకువచ్చాం. తర్వాత ఎకరం పొలంలో సాగు చేశాం. లాభాలు రావడంతో 12 ఎకరాల్లో వేశాం. చుట్టుపక్కల రైతులు మొక్కలు అడిగారు. గతంలో మేమే మొక్కలను అందించేవాళ్లం. ప్రస్తుతం మొక్కల తయారీని ఆపివేశాం. గుంటూరు, ప్రకాశం జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులకు విత్తనాల కోసం ఉచితంగా వాక్కాయలను ఏటా అందిస్తాం. కాయలను కోసేందుకు యంత్రాన్ని తయారుచేయాలని గతంలో శాస్త్రవేత్తలను కోరాం. ఆ యంత్రం వస్తే కూలీ ఖర్చులు మరింత తగ్గి, లాభాలు మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.