హైదరాబాద్- సాధారనంగా ఎవరికైనా జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరకు వెళ్తాం.. కానీ అదే డాక్టర్ కే అనారోగ్యం చేస్తే.. అవును హైదరాబాద్ లో ఓ డాక్టర్ కు గుండెపోటు రావడంతో చనిపోయిన ఘటన తీవ్ర విషాధం నింపింది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
28 ఏళ్ల యువ డాక్టర్ పూర్ణ చందర్ గుండెపోటుతో బుధవారం ఉదయం చనిపోయారు. గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ పూర్ణ చందర్ తన విధులు ముగించుకున్న అనంతరం గాంధీ ఆస్పత్రిలోని నాలుగో అంతస్తు నుంచి బయటకు వస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ఐతే అతను వైద్యానికి సహకరించలేదు.
డాక్టర్ పూర్ణ చందర్ గుండెపోటుతో మరణించినట్లు సీనియర్ వైద్యులు నిర్ధారించారు. డాక్టర్ పూర్ణ చందర్ జనరల్ సర్జరీలో ఇటీవలే సీనియర్ రెసిడెన్సీ పూర్తి చేశారు. ప్రస్తుతం పూర్ణ చందర్ గాంధీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్గా పనిచేస్తున్నారు. డాక్టర్ పూర్ణ చందర్ మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు అతనితో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు చెప్పారు.
ఛాతీలో నొప్పి వస్తుందని, కడుపుంతా వికారంగా ఉన్నట్లు పూర్ణ చందర్ తెలిపినట్లు సహచర వైద్యులు తెలిపారు. దానికి సంబందించిన మందులు వేసుకున్నాడని, బుధవారం మళ్లీ విధుల్లో చేరాడని వాళ్లు చెప్పారు. కానీ ఇంతలోనే ఇలా జరిగే సరికి పూర్ణచందర్ తో పనిచేసే వారంతా విషాదంలో మునిగిపోయారు.