హైదరాబాద్- తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై చర్యలు మొదలయ్యయి. భూకబ్జా ఆరోపణల నేపధ్యంలో విచారణ చేపట్టిన ప్రభుత్వం.. ఆయనపై వేటేసింది. ఈటెల చూస్తున్న రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈటల రాజేందర్ ఏ శాఖ లేని మంత్రిగా మారారు.
ఇదిలా ఉండగా మంత్రి ఈటల పై వచ్చిన భూ కబ్జా ఆరోపణల్లో ప్రాధమిక ఆధారాలు లభించాయని విజిలెన్స్, రెవెన్యూ అధికారులు తేల్చారు. కాసేపట్లో సీఎస్, ఏసీబీ డీజీ సంబంధిత నివేదికను సీఎం కేసీఆర్కు అందేయనున్నారు. ఈ పరిణామంతో ఈటలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయమని కోరే అవకాశం వుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే గనుక జరిగితే ఈటెల రాజేందర్ టీఆర్ ఎస్ పార్టీలో కొనసాగుతారా లేక పార్టీని వీడతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.