జనసేనాధినేత పవన్కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళీ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పవన్కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై స్పందించినందుకు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తనను ఫోన్లో వేధిస్తున్నారంటూ పోసాని హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ప్రెస్మీట్ పెట్టి అసభ్య పదజాలంతో పవన్ దూషించారు. దీంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పోసానిపై దాడికి యత్నించారు. బుధవారం రాత్రి అమీర్పేట్లోని పోసాని నివాసంపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరినట్లు సమాచారం. ఈ వివాదాల నేపథ్యంలో పోసాని ఎక్కడున్నారనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు.
ఆయన ఒప్పుకున్న సినిమా నిర్మాతలకు సైతం ఆయన జాడ దొరకడంలేదు. కనీసం ఫోన్లకు కూడా రెస్పాండ్ కావడంలేదని సమాచారం. ఇంతకీ పోసాని ఏమయ్యారు అనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది. నగరం వదిలి ఎక్కడికన్న వెళ్లారా? ప్రాణభయంతో వేరే ప్రదేశానికి వెళ్లి దాక్కున్నారా? అనే ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. ప్రెస్మీట్లో ఆయన వాడిన భాషపై సోషల్ మీడియాలో విమర్శులు వస్తున్నాయి. ఆయనకు ఏమాత్రం సంబంధంలేని విషయంతో తలదూర్చి ఇబ్బందులు పడుతున్నారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.