పవన్ కల్యాణ్ ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్లకు సంబంధించి మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. పవన్ వ్యాఖ్యలపై పోసాని ప్రెస్ మీట్ పెట్టి వైకాపా కార్యకర్తగా స్పందించడం. ఆ స్పందన నచ్చక పవన్ అభిమానులు తనకు ఫోన్లు, మెసేజ్లు చేసి దుర్భాషలాడారని.. తన భార్యను కించపరిచారని మరో ప్రెస్ మీట్ పెట్టిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్పై కేసు నమోదు చేస్తానంటూ పోసాని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ అభిమాని రివర్స్లో పోసానిపై ఫిర్యాదు చేశాడు. వైకాపా కార్యకర్తల నుంచి కూడా ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశాడు.
వివరాల్లో కెళితే.. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన జనసేన కార్యకర్త రాజశేఖర్ ఈ ఫిర్యాదు చేశాడు. ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటుంటాడు రాజశేఖర్. పవన్ అభిమానులు తనకు అసభ్యకర మెసేజ్లు పెట్టారని వ్యాఖ్యానించడంతో.. వైకాపా కార్యకర్తలు తనను అనుమానించడం ప్రారంభించారని ఆరోపించాడు. తనను అసభ్యకరంగా తిడుతున్నారని, వేధిస్తున్నారంటూ రాజశేఖర్ సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ‘పవన్ కల్యాణ్ అభిమానులమని చెప్పుకునే పరిస్థితి లేదు. పోసాని కృష్ణమురళి చేసిన ఆరోపణలు, దూషణలతో ఇక్కడ మాపై వేధింపులు ఎక్కువయ్యాయి. పోసాని కృష్ణమురళి వ్యాఖ్యల వల్ల మాకు ప్రాణహాని ఉంది. బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోండి’ అంటూ రాజశేఖర్ ఫిర్యాదు చేశాడు.