‘మా’ ఎన్నికలతో తెలుగు ఇండస్ట్రీలో మొదలైన వివాదాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మేమంతా ఒకే కుటుంబం అని పైకి చెబుతున్నా కూడా లోలోపల జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతూనే ఉన్నాయి. ప్రకాశ్రాజ్, శ్రీకాంత్ మొదలు గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు. విష్ణు ప్యానల్ వారు వారికి నచ్చిన వారిని ఎంచుకుని మా అసోసియేషన్ను నడిపించాలని సూచించారు. ఆ ప్రెస్మీట్లో సీనియర్ నటుడు బెనర్జీ తనకు అవమానం జరిగిందంటూ చెప్పుకొచ్చారు. లైవ్లోనే బోరున విలపించాడు నటుడు బెనర్జీ. అతడిని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తీవ్రంగా బూతులు తిట్టారంటూ ఆరోపించారు.
పోలింగ్ రోజున తనను కొట్టేందుకు మీదకు వచ్చారని బెనర్జీ ఆరోపించాడు. ‘మా ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. తనీష్ను మోహన్బాబు తిడుతున్నారు. నేను పక్కనే ఉండి చూస్తూ ఉండిపోయా. విష్ణు వచ్చి నన్ను పట్టుకున్నాడు. ఆ తర్వాత నన్ను కొట్టేందుకు మోహన్బాబు నా మీదకు వచ్చారు. అమ్మ అదీ ఇదీ అంటూ బూతులు తిట్టారు. దాదాపు అందరిలో నన్ను అరగంట పాటు బూతులు తిట్టారు. డీఆర్సీ సభ్యులు సైతం ఆపలేదు. మూడు రోజులుగా నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. మోహన్బాబు ఇంట్లో ఒక మనిషిగా మెలిగిన వాడిని. మోహన్ బాబు సతీమణి కూడా నాకు ఫోన్ చేసి ఓదార్చారు. ఇంకా ఎందుకు నేను ఈ అసోసియేషన్లో కొనసాగాలి? నేను నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు బెనర్జీ. మా ఎన్నికల సందర్భంగా జరుగుతున్న సంఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.