తెలుగు ఇండస్ట్రీలో వేయి చిత్రాలలో నటించి తన కామెడీతో ప్రేక్షకులను అలరించి చరిత్ర సృష్టించారు అల్లు రామలింగయ్య. కామెడీలోనే విలనీజం పండించి కడుపుబ్బా నవ్వించారు. ఆయన సినీ పరిశ్రమకి ఎంతో సేవ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. ఆయన తర్వాత కూడా ఆయన కుమారుడు అల్లు అరవింద్ నిర్మాతగా ఎన్నో సినిమాలని నిర్మిస్తున్నారు.
ఇక ఆయన వారసులు అల్లు బాబి, అర్జున్, శిరీష్. ప్రస్తుతం బాబీ నిర్మాణ రంగంలో ఉంటే.. అల్లు అర్జున్, శిరీష్ లు హీరోలుగా కొనసాగుతున్నారు. ఈ రోజు అల్లు రామలింగయ్య శత జయంతి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తన సోదరులు బాబీ, శిరీష్తో కలిసి వారి తాత, లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. . అల్లు కుటుంబానికి హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన కోకాపేట్ ప్రాంతంలో భూమి ఉంది. అక్కడ గత సంవత్సరం అల్లు స్టూడియోస్ నిర్మాణానికి సన్నాహాలు చేపట్టారు.
ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమం పూర్తి కాగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆయన జయంతిని పురస్కరించుకొని అల్లు స్టూడియోస్ ఆవరణలో అల్లు రామలింగయ్య గారి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆయన మనవళ్లు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు కలిసి ఆవిష్కరించారు. ఆయన మా గర్వం. అల్లు స్టూడియోస్లో మా ప్రయాణంలో భాగం అవుతారు.. అని అల్లు అర్జున్ చెప్పారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమంలో అల్లు స్టూడియోస్ సిబ్బంది అంతా పాల్గొన్నారు.