ఓ కష్టం వచ్చిన సమయంలోనే నిర్భయంగా ఉండాలి అంటారు. ఇక కరోనా వంటి మహమ్మారితో యుద్ధం చేసే సమయంలో వదంతులకి తావు ఉండకూడదు. కానీ.., కొంత మంది అత్యుత్సాహం లేనిపోనీ పుకార్లకు కారణం అవుతోంది. వీటి కారణంగా ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు మొదలవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ పుకారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ఉత్తమైన మార్గం వ్యాక్సినేషన్ మాత్రమే. ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ దీన్నే ఫాలో అవుతున్నాయి. అమెరికా, యూకే వంటి దేశాలు వ్యాక్సినేషన్ ని భారీ ఎత్తున చేస్తున్నాయి. మన దేశంలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇప్పుడే వేగవంతం అయ్యింది. కానీ.., వ్యాక్సిన్ తీసుకున్న వారు మరో 2 సంవత్సరాలలో చనిపోతారన్న ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీకాల వల్ల కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని, వీటికి ఎలాంటి చికిత్స ఉండదని, టీకాలతోనే ప్రజలు కచ్చితంగా చనిపోతారని నోబెల్ గ్రహీత లుక్ మాంటగ్రైర్ చెప్పాడంటూ.. ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దీనిని ఎక్కువ మంది నిజమోనేమో అనుకుంటూ అందరికీ షేర్ చేస్తున్నారు. కానీ.., ఇదో పెద్ద ఫేక్ న్యూస్.
తాజాగా కేంద్రం కూడా ఈ విషయంలో ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా కట్టడిలో భాగంగా అందించే వ్యాక్సిన్లు అత్యంత సురక్షితమని, వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండు సంవత్సరాలలో మరణిస్తారనేది దానిపై ఎలాంటి ఆధారాలు లేవేని, ఈ వార్తలు పూర్తి అవాస్తవమని, ఇలాంటి వాటిని ప్రజలెవరూ నమ్మకూడదని సూచించింది. ఇలాంటి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయోద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో క్లారిటీ ఇచ్చింది. దీంతో.., ప్రజలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సమయంలో ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క కరోనా విషయంలోనే కాదు.., బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ విషయంలో కూడా కొంత మంది ఇలాంటి గాలి వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇవి కొత్త తలనొప్పులకు కారణం అవుతున్నాయి. ఇక నిన్న మొన్నటి వరకు వ్యాక్సిన్ అంటే భయపడ్డ వారు ఇప్పుడిప్పుడే వ్యాక్సినేషన్ ప్రక్రియపై నమ్మకం ఉంచి ముందుకి వస్తున్నారు. కాగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు గల వారకి టీకాలు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు ఇలాంటి ఫేక్ న్యూస్ విషయంలో అవగాహన కలిగి ఉండటం ఎంతైనా మంచిది.