దేశంలో కరోనా ఎప్పుడు అంతం అవుతుంది? పెద్ద పెద్ద వైద్య నిపుణులకు, శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని ప్రశ్న ఇది. గత ఏడాది కాలంగా ఈ మహమ్మారి దెబ్బకి జన జీవనం స్తంభించిపోయింది. ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కరోనా విషయంలో నిత్యానంద సంచలన కామెంట్స్ చేశారు. దేశములో కరోనా ఎప్పుడు అంతం అవుతుందో అయన శెలవిచ్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఎప్పుడు ఏదో ఒక వివాదస్పద అంశాలతో వార్తల్లో ఉండే నిత్యానంద గురించి పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆయన అత్యాచార ఆరోపణలతో ఇండియా నుండి తప్పించుకుని తిరుగుతున్నారు. భారత్ ని విడిచాక ఈయన పైత్యం ఇంకా ముదిరిపోయింది. ప్రస్తుతం నిత్యానంద ఈక్వెడార్ దేశం సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసి.., దాన్ని కైలాస పేరిట ఓ ప్రత్యేక దేశంగా ప్రకటించుకుని అందులో నివశిస్తున్నాడు. ఇక్కడ అయన ఇష్ట ప్రకారమే చట్టాలు నిర్దేశించబడ్డాయి. పైగా.., సొంత కరెన్సీ, బ్యాంకులు, ప్రత్యేక పాస్ పోర్టులు ఇలా పలు అంశాలతో తన కైలాశాన్ని ప్రత్యేక దేశంగా మార్చేసుకున్నాడు నిత్యానంద.
అంతర్జాతీయ చట్టాలను అనుసరించి చూస్తే నిత్యానంద కైలాశాన్ని ప్రత్యేక దేశంగా చూడలేమని ప్రపంచదేశాలు ఎప్పుడో ప్రకటించాయి. కానీ.., మన వివాదాస్పద స్వాములు వారు మాత్రం వాటిని ఏ మాత్రం లెక్క చేయడం లేదు. తన దేశాన్ని గుర్తించాలని ఐక్యరాజ్యసమితిని కూడా కోరారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో తన దేశానికి కొన్ని యూరప్ దేశాల నుంచి రాకపోకలను కూడా నిషేధించారు. ఈ మేరకు ఆయా దేశాల దౌత్య కార్యాలయాలకు ఆయన లేఖలు కూడా రాయడం విశేషం. ఇక ఇండియా నుండి పరారైన నిత్యానంద ఇప్పుడు ఆన్లైన్ వేదికగా తరుచూ తన శిష్యులతో మాట్లాడుతున్నారు. వారి ప్రశ్నలను నివృత్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ భక్తుడు స్వామి ఇండియాలో కరోనా ఎప్పడు అంతం అవుతుందంటూ ఓ ప్రశ్న వేశారు. దానికి.., నిత్యా నంద తాను భారత గడ్డపై ఎప్పుడు కాలు మోపితే అప్పుడే కరోనాకు ఆఖరి ఘడియలు అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజమే నిత్యానంద పైత్యం ముందు కరోనా కూడా నిలవలేదు అంటూ.. నెటిజన్స్ ఆన్లైన్ వేదికగా నవ్వులు పూయిస్తున్నారు. కొంతమంది నిత్యానందని కరోనా బాబా అంటూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. మరి.. నిత్యానంద కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.