ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం అని అంతా నమ్ముతారు. పేద, మధ్య తరగతి ప్రజలకి ఈ బస్సు ప్రయాణం ఆర్ధికంగా కూడా వెసులుబాటుగా ఉంటుంది. ఇక పెరుగుతున్న పెట్రోల్ ధరలు కారణంగా వాహనాలు ఉన్న వారు కూడా ఆర్టీసీ బస్సులలో ప్రయాణాలు చేస్తున్నారు. సాధారణ ప్రజల నుండి ఇంత ఆదరణ లభిస్తున్నా, దేశంలో దాదాపు ప్రతి రాష్ట్రంలో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉంటున్నాయి. మన దగ్గర ఈ పరిస్థితిని మార్చడానికి సజ్జనార్ లాంటి వాళ్ళు నిత్యం కష్టపడుతూనే ఉన్నారు. కానీ.., కొన్ని రాష్ట్రాలలో అధికారులు చేస్తున్న పనికి ఆర్టీసీకి ఉన్న ఆదాయం కూడా పోయేలా కనిపిస్తుంది. తాజాగా కర్ణాటక ఆర్టీసీలో ఇలాంటి ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.
ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే సమయంలో అందరికీ ఎదురయ్యే ప్రధాన సమస్య చిల్లరే. టికెట్ ధరకి సరిపడే అంత చిల్లర ప్రయాణికుల దగ్గర ఉండదు. మరోవైపు కండక్టర్ లు కూడా అంత చిల్లర మైంటైన్ చేయరు. అన్నిటికీ మించి.., ఒక్కోసారి కండక్టర్లు చిల్లర ఉంచుకుని కూడా టికెట్ వెనుక వైపు రాసి ఇస్తాము.. దిగే సమయంలో డబ్బులు తీసుకోండని చెప్తుంటారు. కానీ.., ప్రయాణికులు మాత్రం స్టాప్ వచ్చాక ఆ చిల్లర మర్చిపోయి బస్సు దిగేస్తుంటారు. ఇందుకే.. కండక్టరు చిల్లర టికెట్ వెనుక రాసిస్తామని చెప్పినా ప్రయాణికులు వినకుండా, తమ చిల్లర కోసం పట్టుబడుతూ ఉంటారు. అయితే.. తాజాగా ఇలాంటి ప్రయాణికులకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
ఇక నుండి కర్ణాటక ఆర్టీసీ బస్సులలో కండక్టర్ ను చిల్లర కోసం విసిగించినా, వాదించినా, గొడవకి దిగినా వారికి జైలు శిక్ష తప్పదని అక్కడి అధికారులు బస్సులలో పోస్టర్స్ అంటించారు. దీంతో అవాక్కు అవ్వడం ప్రజల వంతు అయ్యింది. అసలే ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయి ఉంది. ఇలాంటి సమయంలో అధికారులు.. ప్రయాణికులను ఇబ్బంది పెట్టే నిరనయాలు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. మరి.. కర్ణాటక ఆర్టీసీ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.