రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన వారిని చూశాం. రాజభోగాలు అనుభవించి భిక్షమెత్తుకున్న వారినీ చూశాం. ఎప్పుడు ఎవరి స్టార్ తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అదృష్టం ఒక్కోసారి పడిశం పట్టినట్లు పట్టచ్చు ఆ టైమ్లో మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. అలా వేటకు వెళ్లి.. వలేసిన మత్స్యకారుడు ఒక్కరోజు వేటతో కోటీశ్వరుడయ్యాడు. ఏంటి అతని వలకు బంగారం ఏమైనా పడిందా అనుకుంటున్నారా? లేదండి పడింది చేపలే. కానీ, అవి సముద్రపు బంగారంగా పిలిచే ‘ఘోల్ ఫిష్’లు అనమాట.
పాల్ఘర్లోని ముర్ఖేకి చెందిన చంద్రకాంత్ తారే అనే మత్స్యకారుడు తన వలలో పడిన 157 ఘోల్ చేపలతో కోట్లు సంపాదించాడు. వర్షాకాలం సమయంలో ముంబయి- పాల్ఘర్ తీరంలో అధికారులు చేపల వేటపై నిషేధం విధించారు. ప్రస్తుతం నిషేధం ఎత్తివేడంతో పది మందితో కలిసి చంద్రకాంత్ తారే పాల్ఘర్ తీరానికి 25 నాటికల్ మైళ్ల దూరంలో వేటకు వెళ్లాడు. ఎప్పటిలాగే వల వేశారు. భారీగా చేపలు పడటంతో పడవలోకి ఎక్కించారు. తీరా చూస్తే అవి అత్యంత ఖరీదైన ఘోల్ చేపలు. ఆ వీడియోని బృందంలోని ఓ సభ్యుడు వాట్సప్ ద్వారా పంపడంతో పాల్ఘర్ చుట్టుపక్కల ఆ వార్త వైరల్ అయిపోయింది.
చంద్రకాంత్ తీరానికి రాక ముందే ఆ చేపలు చూసేందుకు అతనికోసం చుట్టుపక్కల ప్రాంతాల వాసులు గుముగూడారు. వ్యాపారులు అతను తెచ్చిన చేపలు కొనేందుకు ఎగబడ్డారు. అదంతా చూసి చంద్రకాంత్ తారే అవాక్కయ్యాడు. వ్యాపారులు వేలం నిర్వహించగా చంద్రకాంత్ తెచ్చిన 157 ఘోల్ చేపలు మొత్తం కోటీ 33 లక్షలు పలికాయి. అంటే దాదాపు ఒక్కో చేప 85 వేల రూపాయలు పడింది. ఒక్క వేటతో చంద్రకాంత్ కోటీశ్వరుడయ్యాడు. ఘోల్ చేపల లోపలి అవయవాలు, చర్మానికి అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయంట. అంతేకాకుండా తూర్పు ఆసియా దేశాల్లో ఈ చేపలకు మంచి గిరాకీ ఉంటుంది. అందుకే అవి అత్యంత ఖరీదైన చేపల జాబితాలో ఉంటాయి.