కొత్తగా పెళ్లయిన భార్యాభర్తల మధ్య అలకలు, గొడవలు మామూలే. భర్త ఉద్యోగ బాధ్యతల్లో బిజీగా ఉండి పట్టించుకోకపోయినా.. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని అనిపించినా భార్యలకు కోపం వస్తుంది. భార్యల కోపాన్ని భరించటం అంత వీజీ కాదు. దేశాన్ని పాలించే రాజుకైనా భార్యను బుజ్జగించటానికి మాత్రం మూడు చెరువుల నీళ్లు తాగాల్సి వస్తుంది. అలాంటిది ఓ సాధారణ కానిస్టేబుల్ వల్ల ఏమవుతుంది చెప్పండి. పెళ్లయిన నెలకే భార్య అలకతో ఇబ్బందుల పాలయ్యాడు. అలిగిన భార్యను బుజ్జగించటానికి సెలవు కావాలంటూ ఏకంగా ఏఎస్పీకి లేఖ రాశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తర ప్రదేశ్లోని మహారాణి గంజ్ జిల్లాకు చెందిన గౌరవ్ చౌదరికి గత డిసెంబర్ నెలలో పెళ్లయింది. సెలవులు ఎక్కువగా దొరక్కపోవటంతో పెళ్లయిన కొద్దిరోజులకే పనిలో చేరాడు. పని బిజీలో పడి భార్యను కొద్దిగా పట్టించుకోవటం తగ్గించాడు. దీంతో భార్యకు కోపం వచ్చింది. పెళ్లయి నెల కూడా కాలేదు.. తనను పట్టించుకోవటం లేదని భర్తపై అలిగింది. అతడి కాల్స్కు జవాబు ఇవ్వటం మానేసింది. భార్య ప్రవర్తనతో గౌరవ్ మతిపోయింది. ఆమెను బుజ్జగించటానికి ఎంతో ప్రయత్నించాడు. అయినా అతడి వల్ల కాలేదు. ఇలా కాదు అనుకున్న భర్త.. ఆమెను బుజ్జగించటానికి కొన్ని రోజులు సెలవు పెట్టాలని నిశ్చయించుకున్నాడు. సెలవుల కోసం ఏఎస్పీకి లేఖ రాశాడు.
‘‘ సార్ నా భార్య నా మీద అలిగింది. నేను ఫోన్ చేస్తుంటే సమాధానం ఇవ్వటం లేదు. ఆమెను బుజ్జగించటానికి నాకు కొన్ని రోజులు సెలవు కావాలి. దయ చేసి నాకు సెలవులు ఇవ్వండి’’ అని రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఏఎస్పీ అతడికి ఐదు రోజులు సెలవు మంజూరు చేశాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లేఖపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ భార్యలను బుజ్జగించటం అంత వీజీకాదు..’’.. ‘‘ మామూలుగా ఉంటేనే భార్యలతో కష్టం.. అలాంటిది అలిగితే ఇంకేమైనా ఉందా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, అలిగిన భార్యను బుజ్జగించడానికి లీవ్ కోరిన కానిస్టేబుల్ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.