ఈ మధ్యకాలంలో పేలుడు ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇలా అకస్మాత్తుగా సంభవిస్తున్న పేలుడు ప్రమాదాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాల కారణంగా మరికొందరికి అంగవైక్యలం ఏర్పడి.. జీవితాన్ని అతికష్టం మీద వెళ్లదీస్తున్నారు. ఇటీవలే విశాఖపట్నంలోని పరవాడ ప్రాంతంలోని ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు సజీవదహనం అయిన సంగతి తెలిసిందే. అంతేకాక పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మరువక ముందే హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డులో పేలుడు ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యయి. భారీ పేలుడు శబ్ధానికి స్థానికంగా ఉండే జనం భయంతో పరుగులు తీశారు.
హైదరాబాద్ లోని నార్సింగ్ ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం కూడా రింగ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో డిటోనేటర్ పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అందరు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా పేలుడు శబ్ధం విని భయాందోళనకు గురయ్యారు. పేలుడు శబ్ధానికి జనం భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.