బకాయి వసూళ్లకు వచ్చిన బ్యాంకు అధికారులకు రైతు నిస్సహాయత వ్యక్తం చేశారు. దీంతో అతని ఇంటికి తాళం వేసేందుకుయత్నించారు.
బ్యాంకు అధికారులు చేసే నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యులకు, రైతులకు రుణం ఇవ్వాలంటే ఎన్నో షరతలు పెట్టి.. రోజుల తరబడి తిప్పుకుంటారు. దేశానికి అన్నపెట్టే రైతుని కొన్ని బ్యాంకుల అధికారులు క్రూరంగా వేధింపులకు గురి చేస్తున్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీ వంటి వారు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతే కిక్కురుమనని ఉంటాయి. కానీ సామాన్యులు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నాడంటే ఇంటికి వెళ్లి తాళం వేస్తుంటాయి. తాజాగా ఓ రైతు విషయంలో కూడా బ్యాంకు అధికారుల క్రూరంగా వ్యవహరించారు. డబ్బులు కడతావా.. లేకుంటే ఇంటికి తాళం వేయమంటావా అంటూ రైతుపై జూలం ప్రదర్శించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధిత రైతు, బ్యాంకర్లు తెలిపిన వివరాల ప్రకారం..
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామానికి చెందిన వడ్డె ముక్తాలయ్యకు 3.13 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. తాండూరులోని తెలంగాణా గ్రామీణ బ్యాంకులో పంట రుణం తీసుకున్నారు. 2019 నాటికి ఆ రుణం రూ.1,36,000లకు చేరుకుంది. ఆ తరువాత కూడా ముక్తాలయ్య పెద్దగా రుణం చెల్లించలేకపోయాడు. దీంతో ప్రస్తుతం ఆ రుణం రూ.2,15,000 అయింది. అలానే 2014లో కరవు రావడం వల్ల టర్మ్ లోన్ కింద రూ.50 వేలు అప్పు ఇచ్చారు.
అది కాస్తా నేటికి రూ. 80 వేలు అయింది. ఈ క్రమంలో బకాయిలు చెల్లించాలని కోరుతూ తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు, రీజినల్ రికవరీ అధికారి జైనా, ఫీల్డ్ ఆఫీసర్ రమేష్లు గురువారం రైతు ముక్తాలయ్య ఇంటికి వచ్చారు. కనీసం రూ.15 వేలు చెల్లిస్తే రుణాన్ని రెన్యువల్ చేస్తామని అధిరులు తెలిపారు. ఇప్పుడు తన వద్ద అంత డబ్బులు లేవని, ఇప్పుడేమీ కట్టలేని ముక్తాలయ్య.. అతడి కుమారుడు సురేష్, కోడలు వాణీలు అధికారులను వేడుకున్నారు. చివరకు రైతు రూ.5 వేలు బ్యాంకు అధికారులకు చెల్లించారు.
ఇదే సమయంలో డబ్బులు చెల్లించకుంటే ఇంటికి తాళం వేస్తామని బ్యాంకు అధికారులు అన్నట్లు సమాచారం. ఈ విషయంపై బ్యాంకు అధికారులు స్పందించారు. ఆ రైతు రెండు అప్పులు తీసుకున్నాడని.. అదే విషయాన్ని పలుమార్లు అతనికి చెప్పినట్లు బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు తెలిపారు. బకాయి వసూళ్లలో భాగంగా రైతుల ఇళ్లకు వెళ్తున్నామని, అంతే తప్ప తాళం వేసే యత్నం జరగలేదని చెప్పారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి..