మనిషి జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరం చెప్పలేము. విలాసవంతమైన జీవితం లేకున్న ఏ ఇబ్బందులు లేకుండా బతికే చాలు అనుకునే వాలు చాలామంది ఉంటారు. ఎందుకంటే అనుకోని ఘటనలు ఏమైన జరిగితే భరించే ఆర్ధిక స్థోమత ఉండదు కాబట్టి. అలా కొన్ని ప్రమాదాలు, ఘటనల కారణంగా కొన్ని కుటుంబాలు ఆర్ధికంగా కోలుకోలేని విధంగా దారుణ స్థితిలోకి వెళ్తున్నాయి. తాజాగా ఓ క్యాబ్ డ్రైవర్ కి అలాంటి పరిస్థితే ఎదురైంది. రూ.200 కోసం గొడవపడి ఆస్పత్రి పాలయ్యాడు. ఇప్పటి వరకు రూ. 46 లక్షలు వైద్య చికిత్స కోసం ఖర్చు చేశాడు. అయినా ఇంకా చికిత్స చేయాల్సి ఉంది. ఆ కుటుంబం ఆర్ధికంగా చితికిపోయి.. ప్రభుత్వం సాయం చేయాలని వేడుకుంటుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం సాయిరెడ్డిగూడెంకి చెందిన వెంకటేశ్ గౌడ్..హైదరాబాద్ లో ఓ క్యాబ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. క్యాబ్ నడుపుకుంటూనే పోలీస్ ఉద్యోగానికి సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలో ఓ చిన్న గొడవ ఆయన జీవితాన్ని తలక్రిందులు చేసింది. జులై 31న రాత్రి బీఎన్ రెడ్డి నగర్ నుంచి ఉప్పర్ పల్లికి వివేక్ రెడ్డి అనే వ్యక్తి వెంకటేశ్ గౌడ్ క్యాబ్ ను బుక్ చేసుకున్నాడు. ఉప్పర్ పల్లిలో దిగిన తర్వాత క్యాబ్ ఛార్జీ విషయంలో వివేక్, వెంకటేశ్ మధ్య వాగ్వాదం జరిగింది. రూ.200 లు తనకు రావాలి వెంకటేశ్ గౌడ్ అడగ్గా అంతరేటు లేదు అంటూ వివేక్ గౌడ్ ప్రశ్నించాడు. ఇలా వీరిద్దరి మధ్య మొదలైన చిన్న గొడవ.. చిలికి చిలికి గాలివానలా మారింది. వివేక్..20 మంది తన స్నేహితులను ఫోన్ చేసి పిలిచాడు. వారితో కలిసి వెంకటేశ్ గౌడ్ పై విచక్షణ రహితంగా దాడి చేశారు. వారందరూ బ్యాట్, వికెట్లతో అతడ్ని కొట్టారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్ గౌడ్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.
ఇక అప్పటి నుంచి అక్కడ చికిత్స పొందుతూనే ఉన్నాడు. కోమాలోకి వెళ్లిన అతడికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు వెంకటేశ్ వైద్యం కోసం రూ.46 లక్షల వరకు ఖర్చు పెట్టారు. అయిన ఆ గాయాల నుంచి అతడు కోలుకోవడానికి మరింత సమయం పట్టేలా ఉంది. వెంకటేశ్ వైద్య కోసం అతడి తల్లిదండ్రులు తమకున్న పొలాన్ని అమ్ముకున్నారు. ఆ డబ్బులు సరిపోక మరో 16 లక్షలు అప్పు చేశారు. ఇంత చేసిన వెంకటేశ్ పూర్తిగాకోలుకోలేదు. దీంతో అతడి వైద్యానికి ఖర్చుపెట్టేందుకు తమ దగ్గర ఇక ఏమి లేదని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. తాము ఆర్ధికంగా, మానసికంగా చాలా కుంగిపోయామంటూ వెంకటేశ్ గౌడ్ తల్లిదండ్రులు అంజయ్యగౌడ్, వెంకటమ్మ కన్నీరుమున్నీరవుతున్నారు.