ఏ తల్లికైనా తన పిల్లలపై అమితమైన ప్రేమ ఉంటుుంది. పుట్టినప్పటి నుంచి తన ఊపిరి పోయేంత వరకు పిల్లలకు ఏ కష్టం వచ్చినా అన్నీ తానై అండగా నిలుస్తుంది. బిడ్డల ఆలనాపాలనతోపాటు కష్ట, సుఖాలన్నీ చూసుకుంటుంది. వారు ఏదైనా సాధిస్తే అది తానే సాధించానని గొప్పగా మురిసిపోతుంది. వాళ్లు ఒకవేళ విఫలమైతే తానే ఓడిపోయినంతగా బాధపడుతుంది. అందుకే సృష్టిలో అమ్మను మించిన దైవం లేదంటారు. తరాలు మారినా మాతృత్వంలోని మాధుర్యం మాత్రం మారడం లేదు.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలోనూ తల్లులు తమ పిల్లల సంరక్షణ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఒకవైపు ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తూనే తమ బిడ్డలకు సంబంధించిన ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. పేద, ధనిక అనే తేడాల్లేకుండా చాలా మంది పిల్లల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అయితే ఇక్కడో తల్లి మాత్రం మద్యానికి బానిసై పిల్లల సంరక్షణకు గాలికొదిలేసింది. భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బులతో తాగుడుకు బానిసై.. తన బిడ్డల ఆకలిని కూడా పట్టించుకోకుండా రోడ్డుపై స్పృహ లేకుండా పడిపోయింది. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో చోటుచేసుకుంది.
మాతృత్వాన్ని మరచి మద్యం మత్తులో తూలుతూ రోడ్డుపై ఓ మహిళ పడిపోయింది. దీంతో ఆమె బిడ్డల్లో ఒకరు ఆకలి బాధతో గుక్కపెట్టి ఏడుస్తుండగా.. మరొకరు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి వచ్చిన పోలీసులు వారిని చేరదీశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను తట్టిలేపారు. ఆమె ఎంతకీ లేవకపోవడంతో.. పోలీసులు 108ను పిలిపించి, గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత బాబు, పాపను స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసు సిబ్బంది.. ఉదయం చైల్డ్ లైన్ సిబ్బందిని పిలిచి వారికి అప్పగించారు.