తెలంగాణలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పిల్లలపై వరుసగా కుక్కలు దాడులు చేస్తున్నాయి. అంబర్ పేట ఘటనను మరువక ముందే మరోచోట అలాంటి ఘటనే పునరావృతమైంది.
తెలంగాణలో వీధి కుక్కలు జనాలను భయపెడుతున్నాయి. ఇటీవల రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని అంబర్ పేటలో నాలుగేళ్ల చిన్నారిపై వీధికుక్కలు దాడి చేయడం గురించి తెలిసిందే. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రదీప్ అనే బాలుడు మృతి చెందిన విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనను మరువక ముందే మరోచోట కుక్కల దాడి జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. కోనారావుపేటలో నాలుగేళ్ల చిన్నారి మీద వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో చిన్నారి చరిష్మా తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు కలసి చిన్నారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అంబర్ పేట లాంటి ఘటన సిరిసిల్లతో పాటు చైతన్యపురిలోనూ చోటుచేసుకుంది. రెండ్రోజుల కింద జరిగిన ఈ ఘటనలో చైతన్యపురికి చెందిన రిషి అనే బాలుడి మీద కుక్కలు అటాక్ చేశాయి. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడిపై వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో బాలుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లలపై నాలుగైదు కుక్కలు వెంటపడ్డాయని, వాటి దాడిలో తమ బాబు రిషిని కుక్కలు కరిచాయని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఉన్న కుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్ చేస్తున్నారు. వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. మరి.. ఈ ఘటనలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.