ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విద్యుత్ పరికరాలు ఏవి పట్టుకున్నా షాక్ కొడుతున్నాయి. ఊరిలో ఎవరి ఇంట్లోనైనా సరే టీవీ, స్విచ్బోర్డ్ ఇలా ఏది పట్టుకున్నా షాక్ కొడుతోంది. స్విచ్ వేయబోయిన ఓ వ్యక్తి షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసి పరీక్షించడానికి వచ్చిన విద్యుత్ శాఖ సిబ్బంది ఒకరు టీవీ ముట్టుకోగానే ఎగిరి పడ్డాడు. దాంతో ఊరు ఊరంతా భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ సంఘటన ఖమ్మం, సత్తుపల్లిలో చోటు చేసుకుంది. ఫేస్, న్యూట్రల్వైర్లు కలవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయి ఇళ్లంతా విద్యుత్ సరఫరా అవుతుందని, విద్యుత్ వైరింగ్ సరిగా లేనందున ఈ పరిస్థితి నెలకొందని గుర్తించారు. బుధవారం నుంచి ఈ పరిస్థితి నెలకొనగా.. విషయం తెలిసిన వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మత్తు చేపట్టారు.
ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ ఫెయిల్ అయితే..
ఫేస్, న్యూట్రల్ వైర్లు కలవడం వల్ల ఫీజ్ కొట్టేసి.. కేవలం ఆ ఇంటి వరకే కరెంట్ కట్ అవుతుంది కానీ.. ఊరిలోని ఇళ్లన్నింటికీ ఎందుకు షాక్ కొడుతుందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ గ్రౌండ్ ఎర్త్ న్యూట్రల్ వైర్ సరిగా లేకపోవటం వల్ల ఇలా జరిగిందని తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని చెప్పకుండా విద్యుత్ శాఖ సిబ్బంది తమ తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి జగన్నాథపురానికి చెందిన ఒగ్గెల కాంతారావు(45) అనే వ్యక్తి రాత్రి ఫ్యాన్ వేయబోయి.. షాక్ కొట్టి కుప్పకూలాడు. ఆయనను సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.