దేశంలో కరోనా కొత్త వేరియంట్ అంత అంతకు పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది. ప్రస్తుతం కొత్త వేరియంట్ బాధితులు 961కి చేరారు. అయితే వీరిలో 320 మంది వైరస్ నుండి కోలుకున్నట్లు తెలిపింది. ఒమిక్రాన్ ఎఫెక్ట్ తెలంగాణ పై బాగానే పడుతుంది.. ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కి చేరిందని అంటున్నారు.
తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఈ రోజు ఆయన హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించి కరోనా కేసుల గురించి మాట్లాడారు. కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, ఇది కరోనా థర్డ్ వేవ్ను సంకేతమని చెప్పారు. దాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో వచ్చే రెండు నుంచి నాలుగు వారాలు అత్యంత కీలకమన్నారు. ఇది మూడో వేవ్ కు ప్రారంభం అన్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్, సంక్రాంతి వేడుకలు వస్తున్నాయన్నరు. ఈ క్రమంలో ప్రజల సందడి ఎక్కువగా ఉండబోతుందని.. దాంతో వచ్చే సంక్రాంతికి కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం అవుతుందన్నారు డీహెచ్.
ఇది చదవండి : 60 యేళ్లు పైబడినవారు బూస్టర్ డోస్ ఎప్పుడు తీసుకోవాలి? ఎలా బుక్ చేసుకోవాలి?
ఫస్ట్, సెకండ్ వేవ్తో పోలిస్తే థర్డ్ వేవ్లో ఐదురెట్లు ఎక్కువ కేసులు నమోదయ్య అవకాశముందన్నారు. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్కు వ్యాప్తి వేగం ఎక్కువ కావడమే దీనికి కారణమని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించిందని ఆయన చెప్పారు. తెలంగాణలో ఆ కేసులు పెరిగాయని తెలిపారు. గతంలో కరోనా రెండు వేవ్లు వచ్చినా కరోనాపై విజయం సాధించామని, వచ్చే థర్డ్ వేవ్ను కూడా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్నారు.
ప్రజలు మాస్క్ ధరించాలని, అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. న్యూఇయర్ వేడుకలను ఎంజాయ్ చేయండి. పార్టీలు చేసుకోండి. కానీ హద్దులు మాత్రం దాటకండి అన్నారు. రాబోయే రోజుల్లో టెస్టుల సంఖ్య పెంచబోతున్నాం. ఎవరూ భయపడకూడదని, వైరస్ కన్నా భయమే ప్రమాదకరమని ఆయన చెప్పారు. అయితే, ఈ థర్డ్ వేవ్ కరోనాకు ముగింపులాంటిదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.