ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇల్లు కట్టుకునే సమయంలో రూ. 3 లక్షలు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించింది.
ఇల్లు కట్టుకోవడం అనేది ఎంతో మంది కల. స్థలం ఉన్నా కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడే నిరుపేదలు, దిగువ మధ్యతరగతి వ్యక్తులు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారికి ఎంతో కొంత కలిసి వస్తుందంటే ఎంతో సంతోషిస్తారు. ఇల్లు కట్టుకుంటే రూ. 3 లక్షలు తగ్గుతాయంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. బయట 2 రూపాయల వడ్డీకి తీసుకున్నా లక్షకు రూ. 2వేలు అంటే.. 3 లక్షలకు రూ. 6 వేలు అవుతుంది. ఆ రకంగా నెలకు రూ. 6 వేలు ఆదా అయినట్టే. బ్యాంకు లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీ పడుతుంది. కానీ ఆ ఈఎంఐ భారం కొంత తగ్గుతుంది కదా. ఈ భారం తగ్గించడం కోసమే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొంతంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయం చేయనున్నట్లు ప్రకటించింది.
దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించింది. గృహలక్ష్మి పథకం కింద ఈ సాయాన్ని అందజేయనుంది. ఈ మేరకు గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల ఇళ్లు చొప్పున మొత్తం 4 లక్షల ఇళ్ల నిర్మాణానికై రూ. 7,350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. మొత్తంగా 4 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చనుంది. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 20 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు, 50 శాతం బీసీ, మైనారిటీలను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలనీ ప్రభుత్వం తెలిపింది. ఇల్లు మహిళ పేరు మీదనే మంజూరవుతుంది. అయితే మహిళ పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉండాలి. జన్ ధన్ ఖాతాను ఎట్టి పరిస్థితుల్లోనూ గృహలక్ష్మి పథకం కోసం వినియోగించవద్దని ప్రభుత్వం తెలిపింది.
లబ్ధిదారులు తమకు ఇష్టమైన డిజైన్ లో ఇల్లు నిర్మించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. పథకం ద్వారా లబ్ధి పొందిన వారి ఇంటి మీద ప్రభుత్వం ఆమోదించిన గృహలక్ష్మి లోగో ఉంటుంది. అర్హులైన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇల్లు కట్టుకునే వారి కుటుంబం ఆహార భద్రత కార్డును (రేషన్ కార్డున) కలిగి ఉండాలి. లబ్ధిదారులకు మూడు దశల్లో ఈ నగదును పంపిణీ చేయనుంది. మొదటి దశలో బేస్మెంట్ లెవల్, రూఫ్ లెవల్, స్లాబు ఇలా మూడు దశల్లో నగదు సాయం చేస్తుంది ప్రభుత్వం. రెండు గదులతో కూడిన ఆర్సీసీ ఇళ్ల నిర్మాణం కోసం ఈ నగదును అందజేయనుంది.
అయితే ఆర్సీసీ ఇళ్లు ఉన్నవారికి, 59 ఉత్తర్వు కింద లబ్ధి పొందిన వారికి ఈ పథకం వర్తించదని స్పష్టం చేసింది. ప్రజలు, ప్రజా ప్రతినిధుల ద్వారా దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు స్వీకరిస్తారు. అనంతరం దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన లబ్దిదారులకు జిల్లా ఇంఛార్జి మంత్రి ఆధ్వర్యంలో దశల వారీగా ఆర్థిక సాయం అందిస్తారు. మహిళల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తారు. గృహలక్ష్మి పథకం కోసం ప్రత్యేక వెబ్ సైట్ మరియు మొబైల్ యాప్ ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.