తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. అలానే రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని కేసీఆర్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మంగా అమలు చేస్తోంది. అంతేకాక ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలన్నింటిలోనూ రైతుబంధు పథకం అతిముఖ్యమైనది. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తునా ఖర్చు చేస్తోంది. ఇప్పటికే పలు విడతల్లో రైతుల అకౌంట్లలో రైతుబంధు డబ్బులను జమ చేశారు. అయితే మరోసారి కేసీఆర్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. యాసంగి సీజన్ సంబంధించిన రైతుబంధు డబ్బులను రేపటి నుంచి రైతుల అకౌంట్లో జమ చేయనుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. అలానే రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రారంభించారు. అలాంటి వాటిల్లో రైతు బంధు పథకం ప్రధానమైనది. 2018 ఎన్నికలకు ముందు ఈ పథకం ప్రవేశపెట్టారు. అయితే మొదట్లో ఎకరానికి రూ.4 వేలు జమ చేశారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రూ. వెయ్యి పెంచి ప్రస్తుతం ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయంగా ఏడాదికి రెండు సార్లు అందిస్తుంది. ఇప్పటివరకు 9 సీజన్లలో రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడిసాయం అందించారు. ఈక్రమంలో ఈ ఏడాదికి గాను రెండో విడతగా రైతుబంధు నిధులు కేసీఆర్ సర్కార్ విడుదల చేసింది. యాసంగి సీజన్కు సంబంధించిన రైతుబంధు డబ్బులను డిసెంబర్, జనవరి నెలల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది.
రేపటి నుంచి మొదలుపెట్టి సంక్రాంతిలోపు రైతులందరి అకౌంట్లలో నేరుగా రైతుబంధు డబ్బులు వేయనుంది. గతంలో ఇచ్చినట్లుగానే విడతల వారీగా నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా ఒక ఎకరం నుంచి ప్రారంభించి సంక్రాంత్రిలోపు రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు వేయనున్నారు. ఈ మేరకు రైతుబంధు కోసం రూ.7.600 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీష్రావును సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ యాసంగి సీజన్ కు గాను విడుదల చేసిన రైతు బంధు పథకం నిధులు దాదాపు 65 లక్షల మంది రైతులు అందుకోనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాక ఇటీవలే కొత్త దరఖాస్తు చేసుకున్న రైతులకు కూడా రైతుబంధు సాయం అందించనున్నట్లు తెలిపింది.
ఇప్పటి వరకు ఈ పథకం కింద దాదాపు రూ.66 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. తాజాగా విడుదల చేసిన రైతుబంధు నిధులను ఎలాంటి కోతలు లేకుండా రైతుల అకౌంట్లో జమ చేయాలని ఫైనాన్స్ సెక్రెటరీకి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పంటలకు ఉచిత సాగునీరు, ఉచిత విద్యుత్, ఉచిత రైతు బీమా పథకాలు రాష్ట్రంలో రైతులకు ఎంతో ఉపయోగ పడుతున్నాయని గతంలో అనేక సార్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మరీ.. రైతులకు సాయం అందిచాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ఈ రైతుబంధు పథకం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.