నేటికాలంలో వాహనాల వినియోగం బాగా పెరిగింది. ఈక్రమంలో అనేక ఫిట్ నెస్ లోని వాహనాలు కూడా రోడ్లపై తిరుగుతున్నాయి. దీంతో అధిక కాలుష్యంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో పోలీసులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి.. ఫిట్ నెస్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలకు జరిమానాలు విధిస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రవాణా వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోతే పునరుద్ధరించుకునే వరకు రోజుకు రూ. 50 చొప్పున పెనాల్టీ వసూలు చేయాలన్న నిబంధనను ఉపసంహరించుకుంది.
కొంతమంది వాహన దారులు ఫిట్ నెస్ గడువు దాటిపోయిన తరువాత దానిని పునరుద్ధరించడం లేదు. మరికొందరు దారుణంగా కొన్ని సంవత్సరాల నుంచి గడువు తీరినవాహనాలను రోడ్లపైకి తీసుకొస్తున్నారు. అలాంటి వారిపై రాష్ట్ర రవాణా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో వాహనాదారులు ఫిట్ నెస్ రెన్యువల్ కోసం RTA కార్యాలయాలకు వస్తున్నారు. కానీ రెన్యూవల్ కొన్నిసార్లు ఆలస్యమవుతుంది. ఈక్రమంలో గడువు తీరిన సమయం ఆ నుంచి రోజుకు రూ.50 జరిమానాగా విధిస్తే ఆలస్య రుసుము వేలకు చేరుకుంటోంది. రెండు, మూడేళ్లుగా ఫిట్నెస్ లేని వాహనాలకు రూ. 30 వేల నుంచి 70 వేల దాకా, ఇంకా కొన్ని వాహనాలకు అయితే రూ. లక్షకు పైగా పెనాల్టీ చూపిస్తోంది. ఈ భారీ జరిమానాలు కట్టలేని వారు తమ వాహనాలను ఇళ్లకే పరిమితం చేస్తున్నారు.
మరికొందరు ఫిట్నెస్ లేకుండానే తిప్పుతున్నారు. అయితే కొందరు అపరాధ రుసుము తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వారి అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఫిట్నెస్ గడువు తీరిన వాహనాలపై పెనాల్టీ లేకుండా మినహాయింపు ఇచ్చింది. ఇప్పటికే కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, 2020 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ 2021 వరకు పెనాల్టీ నుంచి మినహాయింపు వెసులుబాటును కేంద్రం కల్పించినస సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రప్రభుత్వం, రోజుకు రూ.50 పెనాల్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దీనివల్ల దాదాపు మూడు లక్షల వాహన యజమానులకు ఉపశమనం కలగనుంది. ప్రభుత్వం ఇచ్చిన ఊరటను సద్వినియోగం చేసుకుని వాహనదారులు ఇకనైనా సకాలంలో ఫిట్నెస్ పునరుద్ధరించుకుంటారేమో చూడాలి. మరి.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.