ప్రభుత్వ ఉద్యోగం ఈ మాట వినపడితే చాలు.. యవత వెర్రెక్కిపోతారు. ఎంత కష్టమైనా సరే.. గవర్నమెంట్ జాబ్ కొట్టాలని భావిస్తారు. అందుకోసం అహోరాత్రులు శ్రమిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో.. పోలీసు జాబ్కు మరింత క్రేజ్. తాజాగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున పోలీస్ జాబ్స్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించి.. ఫలితాలు విడుదల చేసింది. త్వరలోనే ఈవెంట్స్ నిర్వహించనుంది. దీనికోసం అభ్యర్థులు.. రోజు రన్నింగ్ వంటి వాటిని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ యువకుడు కూడా ఎస్సై అయి సమాజానికి సేవ చేయాలనుకున్నాడు. ఖాకీ కొలువు సాధించి.. కన్నవాళ్ల కళ్లల్లో ఆనందం చూడాలని భావించాడు. కష్టపడి చదివి.. ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించాడు. ప్రస్తుతం ఈవెంట్స్ కోసం సిద్ధం అవుతున్నాడు. అందుకోసం నిత్యం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే ఆ యువకుడి పట్టుదల చూసి విధికి కన్ను కుట్టింది. ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తుండగా.. గుండెపోటు రూపంలో అతడిని బలి తీసుకుంది. ఈ విషాదకర సంఘటన మంగళవారం సూర్యపేటలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
సూర్యపేటకు చెందిన సమర్తపు లక్ష్మయ్య కుమారుడు శ్రీకాంత్ ఎస్సై జాబ్ సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుని అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాడు. ప్రిలిమినరీ పాసైన వారికి శారీరక, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇది పాసైన వారికి ఎస్ఐ మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ క్రమంలో శ్రీకాంత్.. ఈవెంట్స్లో క్వాలిఫైడ్ కావడం కోసం ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ప్రతి రోజు ఉదయం ప్రాక్టీస్ కోసం వెళ్లేవాడు.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్న శ్రీకాంత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి మిత్రులు శ్రీకాంత్ పరిస్థితి గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శ్రీకాంత్ను పరీక్షించి.. అప్పటికే అతడు మృతి చెందినట్లుగా తెలిపారు. కొన్ని నెలల్లో కుమారుడు పోలీస్ అవుతాడని, ప్రయోజకుడు అయ్యి తమ పేరు నిలబెడతాడని భావించిన తల్లిదండ్రులు శ్రీకాంత్ మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. ఎస్సై అవుతాడనుకున్న కొడుకు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో లక్ష్మయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.