తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్న నేపత్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల పాటు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలకు రోడ్లు జలమయమవుతున్నాయి. ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరుసగా మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తుండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఈ నెల 25, 26, 27 తేదీల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంటప్ గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు పనులకు వెళ్లేవారు వర్షం పరిస్థితులు, ట్రాఫిక్ ను అంచనా వేసుకోవాలని సూచిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు మునిగిపోయి ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలుగుతుందని.. కాబట్టి బయటకొచ్చే ముందు పరిస్థితులను అంచనా వేసుకోవాలి అధికారులు చెబుతున్నారు.
ఎవరైనా పాత ఇళ్లలో ఉంటే కనుక తక్షణమే ఖాళీ చేయాలని, కరెంట్ పోల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలానే రోడ్లపై నడిచి వెళ్తున్నప్పుడు మ్యాన్ హొల్స్ ని గమనించాలని కోరుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నెల 27న వర్షం అత్యంత భారీగా కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27 వరకూ స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని పలువురు కోరుతున్నారు.