డబ్బు సంపాదించడానికి కేటుగాళ్లు ఎలాంటి నీచమైన పనులైనా చేస్తున్నారు. తినే ఆహార పదార్థాలనుంచి ఐస్క్రీమ్స్, తాగే పాలు, స్వీట్లు ప్రతీది కల్తీ చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో అన్ని వస్తువులు కల్తీ అయిపోతున్నాయి. మొన్న కల్తీపాలు, నిన్న కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్, కల్తీ ఐస్క్రీం తయారీదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా మారిపోయింది. అవి మరిచిపోకముందే తాజాగా హైదరాబాద్లోని లాల్దర్వాజ ఏరియాలో నకిలీ స్వీట్ల తయారీ దందా బయటపడింది. ప్రజారోగ్యంతో చెలగాటమాడే నకిలీ స్వీట్ల తయారీదారుల ఆట కట్టించారు అధికారులు. ఓ ఇంట్లో స్వీట్లు తయారు చేస్తారని మాత్రం అందరికీ తెలుసు. కానీ అవన్నీ కల్తీ అని అధికారులు దాడులు చేసేంతవరకు ఎవరికీ తెలియదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజస్థాన్ ప్రభుత్వం మిల్క్ పౌడర్ను ఫ్రీగా ఇస్తున్నందున నిర్వాహకులు రాజస్థాన్ నుంచి తెలంగాణకు మిల్క్ పౌడర్ను తీసుకొస్తున్నారు. చీప్గా వస్తున్న మిల్క్ పౌడర్తో స్వీట్స్ తయారు చేస్తూ దందా నడుపుతున్నారు. రంగు, రుచి కోసం కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. నకిలీ స్వీట్ల దందా సమాచారంతో హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని, స్వీట్ల తయారీ యూనిట్ మొత్తాన్ని నిలిపివేశారు. నకిలీ స్వీట్ల తయారీలో సప్లయర్లు ఎవరు? బయ్యర్లు ఎవరు? ఎంతకాలంగా ఈ యూనిట్ నడుస్తోంది? అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. మనం కొనబోయే ముందు ఏది నకిలీదో, కాదో గుర్తించి తీసుకోవాలంటున్నారు అధికారులు. మనం తీయగా లొట్టలేసుకుంటూ తినే ఐటమ్స్ లో ఎంత విషపూరితమో గుర్తించాలంటున్నారు.
ఈ రోజుల్లో డబ్బు మీద వ్యామోహంతో ఎంతటి అఘాయిత్యానికైనా తెగిస్తున్నారు. ఎదుటివారి ప్రాణాలను సైతం అనారోగ్యం పాలైనా పట్టించుకోకుండా తప్పుడు పనులు చేయడానికి వెనుకాడడంలేదు. ఇతరులు కనిపెట్టకుండా పైపై మెరుగులు దిద్దుకుంటూ ప్రజారోగ్యాన్ని హరిస్తున్న నకిలీ దందాలను అధికారులు అరికడుతున్నా.. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటిని రూపుమాపేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కల్తీ దురాగతాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఈ నకిలీ స్వీట్ల్ దందాపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి.