అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి కథ అందరికీ కన్నీళ్లను తెప్పిస్తోంది. వైద్యం కోసం కనీసం ఆస్పత్రికి వెళ్లేందుకు దారి ఖర్చులు కూడా లేక ఆ బాలిక కుటుంబం దీనావస్థలో ఉంది.
ఆమెదో చిన్న కుటుంబం. పేదోళ్లయినా కూలీ చేసుకుని ఉన్నంతలో సంతోషంగా బతికేది. గంగిరెద్దుల ప్రదర్శనతో భర్త మరికొంత సంపాదించేవాడు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ కుటుంబం మీద విధి పగబట్టింది. అరుదైన వ్యాధితో మూడేళ్ల వయసులోనే పెద్ద కూతురు చనిపోయింది. అదే వ్యాధితో బాధపడుతున్న నాలుగేళ్ల చిన్న కూతరు కాలు కదపలేని పరిస్థితి. ఆమెకు ట్రీట్మెంట్ కోసం ఆ తల్లి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. కూతుర్ని కాపాడుకునేందుకు దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం, బేరువాడ గ్రామానికి చెందిన ఆవుల వెంకన్న – సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు.
వెంకన్న – సరిత దంపతుల పెద్ద కూతురు నందిని కాలికి నాలుగేళ్ల కింద పుండై ఇన్ఫెక్షన్ సోకింది. ఆస్పత్రుల చుట్టూ ఎంత తిరిగినా ఫలితం లేకపోయింది. రెండేళ్ల తర్వాత ఆ పాప చనిపోయింది. ఆమె మృతి చెందిన నెల రోజులకే రెండో కూతురు శివాని పుట్టింది. ఆమెకు కూడా రెండేళ్ల వయసులో ఎడమ కాలు మోకాలి కింద చిన్న కురుపు అయింది. ఆ కురుపు కాస్త పుండుగా మారింది. స్థానిక ఆర్ఎంపీల వద్ద ట్రీట్మెంట్ చేయించినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో భర్త వెంకన్న పక్షవాతంతో మంచానపడి చనిపోయాడు. దీంతో కుటుంబ భారం సరిత మీద పడింది.
కూతురుకు సోకిన అరుదైన వ్యాధితో కాళ్లు వంకరగా మారాయి. కాలు దగ్గర కండరం దెబ్బతిని చిన్నారి ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తుండటంతో ఆ తల్లి మనసు తల్లడిల్లింది. ప్రస్తుతం ఆ చిన్నారి కాలు చర్మంతో వేలాడుతోంది. రెండు మోకాళ్ల మీద పుండ్లు ఏర్పడ్డాయి. స్థానిక ఆస్పత్రికి వెళ్తే పాప ఆరోగ్యం విషమించిందని.. ఇప్పుడు వస్తే ఎలా అంటున్నారు. పెద్దాసుపత్రికి వెళ్లాలంటూ డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లేందుకు దారి ఖర్చులకూ డబ్బుల్లేక దయనీయ స్థితిలో ఉన్న ఆ తల్లి.. తన కూతురి వైద్యానికి ఎవరైనా సాయం చేయకపోతారా అంటూ దాతల కోసం ఎదురుచూస్తోంది.