హైదరాబాద్- తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. డిసెంబర్ 27-31 వరకు ఏకంగా 902 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు సాగాయి. డిసెంబర్ నెల విక్రయాల్లోనూ రికార్డు నమోదయ్యింది. గతంలో ఎప్పుడు లేని విధంగా.. ఈ ఏడాది డిసెంబర్ లో మద్యం అమ్మకాల విలువ ఏకంగా 3,350 కోట్ల రూపాయలకు చేరుకుంది.
కోవిడ్ కారణంగా 2020లో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు మందకోడిగా సాగాయి. అయితే 2021లో న్యూ ఈయర్ వేడుకలకు అనుమతి ఇవ్వడంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. డిసెంబర్ 31 రాత్రి 7 గంటల వరకే 148.52 కోట్ల రూపాయల అమ్మకాలు సాగాయి. మొత్తంగా 2021 ఏడాది అంతా 9 కోట్ల బీర్లు.. 44 కోట్ల లిక్కర్ సీసాలు అమ్ముడయ్యాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 6,979 కోట్ల రూపాయల మద్యం, నల్గొండలో 3, 288 కోట్ల రూపాయలు, హైదరాబాద్లో 3,201 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు సాగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.