మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండడంతో ప్రధాన పార్టీల నేతలతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారు కూడా తమ తమ స్థాయుల్లో ప్రచారం సాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాల్, ఎన్నికల ప్రచారంలో కూడా చాలా ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఇటీవల దోశలు వేస్తూ.. చెప్పులు కుడుతూ కనిపించిన కే ఏ పాల్, తాజాగా తన మాస్ డాన్స్ తో ఓటర్లను ఉర్రుతలూగించాడు.
మునుగోడు ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. మొన్నటికి మొన్న పాల్ ఓ హెటల్ లో దోశ వేస్తూ కనిపించారు. చేతులతో దోశను కాలుస్తూనే.. అక్కడున్న వారితో మాట్లాడారు. ఎన్నికల్లో తనకు ఉంగరం గుర్తును కేటాయించారని చెప్పిన ఆయన, “ఉంగరం గుర్తుకు ఓటేస్తే మునుగోడును అమెరికా మాదిరిగా మారుస్తానని” చెప్పుకొచ్చారు. ఇదిమరవక ముందే మరోచోట చెప్పులు కుడుతూ వినూత్న ప్రచారం నిర్వహించారు. “అమెరికాలో చెప్పులు కుట్టిన అబ్రహం లింకన్ అధ్యక్షుడు అయ్యాడు. అది అమెరికా గొప్పతనం. కానీ మనదేశంలో ఇది సాధ్యమా.. ” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా వినూత్న ప్రయత్నంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.. కే ఏ పాల్.