గూగుల్ తల్లి కారణంగా ఓ విద్యార్ధి నిండా మోసపోయాడు. గూగుల్ మ్యాప్స్ చూపిన దారి వెంట వెళ్లిన అతడికి వింత అనుభవం ఎదురైంది. ఈ కారణంగా అతడు ఇంటికి వెనుదిరిగాడు. ఆ..? గూగుల్ మ్యాప్స్ మోసం చేయడం ఏంటి అనుకుంటున్నారా..? అయితే, ఈ కథనం చదివేయండి..
తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన సంగతి అందరికీ విదితమే. ఈ పరీక్షలకు విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని బోర్డు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయినప్పటికీ, కొందరు విద్యార్థులు అనుకోని సంఘటనలతో ఎగ్జామ్ సెంటర్లకు ఆలస్యంగా వస్తూ, పరీక్షకు దూరమవుతున్నారు. తాజాగా, ఖమ్మంకు చెందిన ఓ విద్యార్ధి గూగుల్ తల్లిని నమ్ముకొని మోసపోయాడు. గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకొని, అది చూపిన దారి వెంట వెళ్లిన విద్యార్థికి వింత అనుభవం ఎదురైంది. ఆ వివరాలు..
ఖమ్మం జిల్లా కొండాపురం గ్రామానికి చెందిన వినయ్ అనే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి గూగుల్ మ్యాప్ సహాయంతో ఎగ్జామ్ సెంటర్ కు చేరుకున్నాడు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించబోతున్న అతడి హాల్ టికెట్ ను పరిశీలించిన అధికారులు.. అతనిది వేరే ఎగ్జామ్ సెంటర్ అని చెప్పడంతో అవాక్కయ్యాడు. వెంటనే తనకు కేటాయించిన పరీక్షా కేంద్రం వైపు పరుగులు తీశాడు. కానీ, అప్పటికే 27 నిమిషాలు ఆలస్యం కావడంతో సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో వినయ్ కన్నీళ్లతో వెనుదిరిగాడు. ఈ ఘటన ఎన్.ఎస్.పి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రంలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అనుమటించలేదని అధికారులు చెప్తున్నారు. కావున మీరూ కూడా గూగుల్ తల్లిని నమ్మే ముందు జాగ్రత్త సుమా..! ఇలాంటి వింత అనుభవాలు మీకెప్పుడైనా ఎదురయ్యాయా.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
గూగుల్ మ్యాప్ నమ్ముకుని మోసపోయిన ఇంటర్ విద్యార్థి
ఖమ్మం – చేరుకోవాల్సిన సెంటర్ కాకుండా వేరే లొకేషన్ చూపించిన గూగుల్ మ్యాప్. 27 నిమిషాల ఆలస్యంగా పరీక్షా కేంద్రంకు చేరుకున్న వినయ్ను లోపలకు అనుమతించని సిబ్బంది. పరీక్షా కేంద్రం నుండి తిరిగి ఇంటికి వెళ్లిపోయిన విద్యార్ధి#Khammam pic.twitter.com/Y39pbZ5az2
— Telugu Scribe (@TeluguScribe) March 15, 2023