ట్రాఫిక్ కష్టాలతో ఇబ్బందులు పడుతున్న నగర వాసులకు శుభవార్త అందుతోంది. దగ్గరలోనే దశాబ్దాల నాటి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు నగర జిహెచ్ఎంసి అధికారి కీలక ప్రకటన చేశారు. ఏంటా శుభవార్త..? వాస్తవంగానే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయా..? అన్నది ఇప్పుడు చూద్దాం..
నగరంలో ట్రాఫిక్ కష్టాలు ఏ రీతిలో ఉంటాయో అందరికీ సుపరిచితమే. సాధారణ రోజుల్లో సమయానికే ఇంటికి వెళ్లినా.. వర్షం పడ్డ రోజుల్లో మాత్రం మరుసటి రోజు ఇంటికి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో సార్లు చూశాం.. రాబోవు రోజుల్లో ఈ కష్టాలు కొంతమేర తగ్గుముఖం పట్టనున్నాయి. దశాబ్దాల నాటి ట్రాఫిక్ సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం అద్భుత పరిష్కారం చూపిస్తోంది. ఇప్పటికే నగరవ్యాప్తంగా ఎన్నో ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రాగా, నగర నడిబొడ్డున ఆర్టిసి ఎక్స్రోడ్ పరిసర ప్రాంతాలలోని ఫ్లైఓవర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
విఎస్టి జంక్షన్ నుండి ఆర్టిసి ఎక్స్రోడ్ మీదుగా ఇందిరా పార్క్ వరకు దాదాపు 2.62 కి.మీ పొడవునా స్టీల్ ఫ్లైఓవర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీంతో పాటు రామ్ నగర్, బాగ్ లింగంపల్లి మధ్య మరో మూడు లేన్ల 850 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ రెండు ఫ్లై ఓవర్లను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి అందుబాటులోకి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. “తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున(జూన్ 2) మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిపించడానికి ఎలివేటెడ్ కారిడార్, ఫ్లైఓవర్ లని సిద్ధంగా ఉంచుతున్నాం..” అని నగర జిహెచ్ఎంసి అధికారి ఒకరు ప్రకటన చేశారు.
విఎస్టి జంక్షన్ – ఆర్టిసి ఎక్స్రోడ్ – ఇందిరా పార్క్ ఫ్లై ఓవర్ పనులు రూ.350 కోట్ల అంచనా వ్యయం కాగా, ఇందిరా పార్క్, రామ్నగర్ – బాగ్ లింగంపల్లి వరకు నిర్మిస్తున్న స్టీల్ ఫ్లైఓవర్ల పనులు రూ.76 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ రెండు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వస్తే.. గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాలు, రామంతాపూర్, ఉప్పల్, అంబర్ పేట్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.