సాధారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రచారం చేస్తుంటారు. కొంతమంది ఆకతాయిలు కాల్ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. డయల్ 100కి కాల్ చేస్తే.. పోలీసులు తప్పకుండా స్పందిస్తారని ఓ నమ్మకం. హైదరాబాద్ నగరంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్వయంగా డయల్ 100కు ఫోన్ చేశారు. ఎందుకు ఆయన సామాన్యూడిలా కాల్ చేసి.. పోలీసులకు కంప్లేంట్ ఇచ్చారు అనే వివరాల్లోకి వెళితే..
జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీకి సమీపంలో ఉన్న ప్లజెంట్ వ్యాలీలో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నివాసముంటున్నారు. సీవీ ఆనంద్ రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు టపాసులు పేలుస్తూ.. డప్పులు వాయిస్తూ.. న్యూసెన్స్ చేయడాన్ని గమనించారు. తన పేరు చెప్పకుండా ఒక సామాన్య వ్యక్తిలా డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. కాల్ రిసీవ్ చేసుకున్న సిబ్బంది మీరెవరని అడగ్గా.. ఫోన్ పెట్టేశారు.
కంట్రోల్ రూమ్ సిబ్బంది తక్షణమే స్పందించారు. డయల్ 100 సిబ్బంది వెంటనే జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు రాత్రి విధుల్లో ఉన్న జూబ్లీహిల్స్ డీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. కమిషనర్ ఇంటికి సమీపంలో ఉన్న ఓంనగర్ బస్తీలో కొంతమంది తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు చూశారు.
ఆ ఊరేగింపు లో కొందరు యువకులు అత్యుత్సాహంతో గట్టిగా డప్పులు వాయిస్తూ టపాసులు పేలుస్తూ.. అక్కడ భారీ ఎత్తున్న సౌండ్స్ తో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ అనే వ్యక్తి అదుపులోకి తీసుకుని అతడిపై 70బి సెక్షన్ కింద పెట్టీ కేసు నమోదు చేశారు. సీపీ ఒక సామాన్యుడిలా డయల్ 100కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించమని కోరడం పోలీసు వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.