ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వాగులు, నదులు, జలపాతాలు పొంగిపొర్లుతున్న విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వాననీరు వచ్చి జనజీవనం అస్తవ్యస్తం అయిపోయారు. పలుచోట్ల రోడ్లు, వంతెనలు కూడా నీట మునిగిపోయాయి.
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా కురిసిన వానలకు రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. తెలంగాణలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తన కొడుకుకు అత్యవసర వైద్యం అందించేందుకు తండ్రి సాహసం చేసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లక్మీపూర్ గ్రామంలో పవన్, కవిత అనే దంపతులు నివాసముంటున్నారు. వారికి ఏడాది వయసు గల బాబు ఉన్నాడు. ఆ బాలుడు గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది ఆస్పత్రికి తీసుకెళ్లాలని మరో వ్యక్తితో బయలుదేరారు. మార్గమధ్యలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులో పవన్ తన కొడుకును చేతులతో పైకెత్తి తాళ్లను పట్టుకుని వాగు దాటారు. పవన్తోపాటు అతని భార్య, బంధువు కూడా వాగుదాటి ఆస్పత్రికి వెళ్లారు.
కొడుకుకు చికిత్స చేయించారు. గిరిజన ప్రాంతాల్లో ఇలాంటివి జరగడం మామూలే. అడవి ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ సరిగ్గాలేక అక్కడి ప్రజలు నానా తంటాలు పడుతుంటారు. లక్మాపూర్ గ్రామంలాగే చాలా గ్రామాలు వాగులు ప్రవహిస్తుండడంతో బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయి ఉన్నాయి. అక్కడి జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.