కస్టమర్లను ఆకట్టుకునేందుకు తొలి రోజే లేక వారం రోజుల పాటు తక్కువకు తమ సరుకును అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు వ్యాపారస్థులు. దీని కోసం ఆఫర్స్ అందిస్తున్నామంటూ ముందుగా ప్రచారం చేస్తారు కూడా. ఇక బిర్యానీ తక్కువకు ఇస్తారంటే.. ఇక ఆగుతారా.
ఫ్రీగా పినాయిల్ వస్తుందంటే తాగే రకం మనం. అలాంటిది ఏదైనా ఫ్రీ లేదా తక్కువగా ఇస్తున్నారంటే కిలోమీటర్ల అవతల ఉన్నా వెళ్లి తెచ్చుకుంటాం. ఆ ఫ్రీ వస్తువు కోసం బైక్ లేదా ఇతర ప్రయాణ సాధనాలకు ఖర్చు గురించి వదిలేస్తాం. కొత్తగా బిజినెస్ స్టార్ చేసేవాళ్లకు లేదా వ్యాపారాన్ని అభివృద్ది చేసుకోవాలనుకన్న వ్యాపారస్థులకు ఇదే కిటుకుగా తయారయ్యింది. ముందుగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు తొలి రోజే లేక వారం రోజుల పాటు తక్కువకు తమ సరుకును అమ్మేందుకు ప్రయత్నాలు సాగిస్తుంటారు. దీని కోసం ముందుగా ప్రచారం చేస్తారు కూడా. ఇక బిర్యానీ తక్కువకు ఇస్తారంటే.. ఇక ఆగుతారా..? అదే జరిగింది తెలంగాణలోని కరీం నగర్లో.
తెలంగాణలోని కరీంనగర్లో ద ఎంపైర్ హోటల్ అనే బిర్యానీ హోటల్ను తెరిచారు. అయితే తమ షాపు ఓపెనింగ్ రోజైన 16వ తేదీన బిర్యానీని రూ. 1కే ఇస్తున్నట్లు ప్రకటించారు యాజమాన్యం. అయితే రూపాయి నోటుకు బిర్యానీ అని ప్రచారం చేశారు. ఈ రోజుల్లో ఎవ్వరి దగ్గర రూపాయి నోటు ఉంటుందిలే అని ప్రచారం ముమ్మురం చేశారు. అదీ కూడా మధ్యాహ్నం రూ. 2.30 గంటల తర్వాత అని బ్యానర్లలో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఆఫర్ హల్ చల్ చేసింది. రెస్టారెంట్ తెరిచిన రోజు ఓనర్కు కస్టమర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. పాత రూపాయి నోట్లతో పెద్ద ఎత్తున షాపుకు రావడం మొదలు పెట్టారు. వారిని ఆపడం యాజమాన్యం వల్ల కాలేదు.
రూపాయికే బిర్యానీ అనగానే.. కరీం నగర్ వాసులు పాత నోటుతో షాపుకు దండ యాత్ర చేశారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. అలాగే కొంత మంది రోడ్లపై బండ్లు పెట్టేయంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు సైతం నియంత్రించలేకపోయారు. అయితే కొంత మంది వాహనదారులకు రూ. 200 ఫైన్ వేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎండను సైతం లెక్క చేయకుండా దుకాణానికి క్యూ కట్టారు. జనాలు ఎగబడి కొనడంతో కాస్త తోపులాట జరిగింది. దీంతో డోర్స్ క్లోజ్ చేసిన రెస్టారెంట్ సిబ్బంది.. రూపాయి నోటు తెచ్చిన వారికి.. కౌంటర్ ఏర్పాటు చేసి పార్శిల్ రూపంలో బిర్యానీ అందజేశారు.