అయ్యాప్పస్వామి పుట్టుక, చరిత్రపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ కు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు కొడంగల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
గతంలో అయ్యాప్పస్వామి పుట్టుక, చరిత్రపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ కు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు కొడంగల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో అతడి విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక బైరి నరేష్ బెయిల్ మంజూరు కావడంతో అతని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గతేడాది డిసెంబర్ 19న కొడంగల్ లోని ఓ గ్రామంలో నిర్వహించిన ఓ సభలో నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేష్ వక్తగా హాజరయ్యాడు.
ఈ సందర్భంగా ఆయన అయ్యప్ప స్వామి పుట్టుక, చరిత్ర గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ సభలో ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారాయి. ఇక అయ్యప్ప పుట్టుక, చరిత్ర గురించి బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హిందువులు, అయ్యప్ప మాలధారులు ఒక్కసారిగా కోపంతో రగిలిపోయారు. బైరి నరేష్ వ్యాఖ్యల పట్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయని, అయ్యప్ప మాలధారులు, హిందువులు అంతా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అతనిపై చాలా మంది అయ్యప్ప భక్తులు, హిందువులు దాడికి కూడా దిగారు.
అప్పట్లో బైరి నరేష్ పై దాడి చేసిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే ఇదే అంశం అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచనలంగా మారింది. దీంతో బైరి నరేష్ వ్యాఖ్యల పై ఏపీ, తెలంగాణలో అనేక పోలీస్ స్టేషన్ లలో అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు, అయ్యప్ప భక్తులు అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలంటూ పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. దీంతో పోలీసులు అలెర్ట్ అయి.. ఎట్టకేలకు బైరి నరేష్ ను అరెస్ట్ చేసి పరిగి సబ్ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే 45 రోజుల పాటు జైలులో ఉన్న బైరి నరేష్ కు కొడంగల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.